బొంరాస్పేట, జూలై 21: పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకంతో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతున్నది. సూక్ష్మ పోషక లోపాలు తరచుగా కనబడుతాయి. ఉత్పత్తి కూడా తగ్గి ఖర్చు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో నేల సహజత్వాన్ని కాపాడుతూ అధిక దిగుబడులను సాధించేందుకు పచ్చిరొట్ట ఎరువులు ఎంతగానో దోహదపడుతాయి. పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో చల్లి అవి పెరిగిన తర్వాత అదే పొలంలో కలియదున్ని పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ విత్తనాలను జూన్ లేదా తొలకరి వర్షాలు ప్రారంభమైనప్పుడు పొలం లో చల్లుకోవాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి భూమిలో సారాన్ని పెంచేందుకు వ్యవసాయాధికారులు పచ్చిరొట్ట ఎరువులను ప్రోత్సహిస్తున్నారు. రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా రైతులు జీలుగ, జనుమును పడించి ఏపుగా పెరిగిన తరువాత వాటిని పొలంలోనే కలియదున్ని పచ్చిరొట్ట ఎరువుగా పంటలకు వినియోగించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జీలుగ, జనుము విత్తనాలను రైతులకు రాయితీపై అం దించి సాగు పెంపునకు అధికారులు ప్రోత్సహిస్తున్నారు. జనుము, జీలుగను పొలంలో దున్నితే పంటకు సత్తువ వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. విత్తనాలు చల్లిన 40 రోజుల్లో జనుము పెరుగుతుంది. పెరిగిన జనుమును పొలంలో కలియ దున్నుతారు. వరి పంటకు జనుమును పచ్చిరొట్ట ఎరువుగా వాడటం వల్ల గడ్డి పెరుగదని, నత్రజని ఎరువులు తగ్గడంతోపాటు దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
పచ్చిరొట్ట ఎరువుతో ప్రయోజనాలు
పచ్చిరొట్ట పైర్లు నేలలో కుళ్లేటప్పుడు జరిగే రసాయన ప్రక్రియ వల్ల భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు సులభంగా లభ్యమవుతాయి. నేల భౌతిక లక్షణాలు వృద్ధిచెంది నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. నీటినిల్వ సామర్థ్యం పెరిగి నేల కోతను అరికడుతుంది. మొక్కల వేర్లకు అవసరమయ్యే గాలి, నీరు పుష్కలంగా అందుతా యి. పండ్ల తోటల్లో పచ్చిరొట్ట పైర్లు సాగుచేసి పూత దశలో కలియదున్నితే నేల సారవంతమవుతుంది. చౌడు సమస్య తొలగిపోయి భూసారం పెరుగుతుంది. వరి పంట సాగు కు ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం వల్ల బియ్యం లో విటమిన్లు, మాంసకృత్తుల శాతం పెరుగుతుంది. దిగుబడి కూడా 15 నుంచి 20 శాతం పెరుగుతుంది.
జిల్లాలో 14,750 ఎకరాల్లో సాగు
పచ్చిరొట్ట పైర్లను జిల్లాలో 14,750 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. రైతులకు రాయితీపై 2,950 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అధికారులు పంపిణీ చేశా రు. కొడంగల్ వ్యవసాయ డివిజన్లోని మూడు మండలాల్లో జనుము 780 ఎకరాల్లో, జీలుగ 580 ఎకరాల్లో ఈ వానకాలంలో రైతులు సాగు చేస్తున్నారు. బొంరాస్పేట మండలంలో జీలుగ 60 క్వింటాళ్లు, జనుము 76 క్వింటాళ్లు, దౌల్తాబాద్ మండలంలో జీలుగ 24 క్విం టాళ్లు, జనుము 70 క్వింటాళ్లు, బొంరాస్పేట మండలం లో జీలుగ 90 క్వింటాళ్లు, జనుము 166 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీ ఆగ్రోస్ ద్వారా పంపిణీ చేశారు.
దిగుబడిని పెంచేందుకే..
పొలాల్లో భూసారాన్ని పెంచి తద్వారా అధిక దిగుబడులను సాధించేందుకు పచ్చిరొట్ట పైర్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. నీటి సౌకర్యం ఉన్న ఏ పొలంలోనైనా పచ్చిరొట్ట విత్తనాలను చల్లి అవి పెరిగిన తరువాత వాటిలోనే కలియదున్ని అన్ని పంటలకు ఎరువుగా వాడుకోవ చ్చు. వీటిని ఎరువుగా వాడటం ద్వారా పంటలకు మేలుచేసే క్రిమి కీటకాలు, వానపాములు వృద్ధి చెందుతాయి.
-శంకర్నాయక్, ఏడీఏ కొడంగల్