వికారాబాద్ జిల్లా నెట్వర్క్ : 15 రోజులపాటు నిర్వహించిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో శనివారం విజయవంతంగా ముగిసింది. ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. పారిశుధ్యం నిరంతరంగా నిర్వహించారు. ప్రజలు శ్రమదానంలో పాల్గొని తమ ఊర్లను బాగు చేసుకున్నారు. మురుగు కాలువలు, వీధులను శుభ్రం చేయడంతోపాటు తడి, పొడి చెత్త సేకరించి ఎరువును తయారు చేశారు. ప్రభుత్వ భవనాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేశారు. పాడుబడ్డ బావులు, భవనాలను కూల్చివేశారు. పల్లెప్రగతి కార్యక్రమాలను మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించారు. ప్రత్యేకాధికారులు కూడా గ్రామాల్లో పర్యటించారు. క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేశారు. నర్సరీల్లో మొక్కలు నాటారు. చివరి రోజు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పదిహేను రోజులపాటు ఎలాంటి పనులు చేపట్టారో ప్రజలకు వివరించారు. ఇంకా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పలు గ్రామాల పారిశుధ్య సిబ్బందిని సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. ఏండ్ల కొద్దీ పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమయ్యాయని, గత నాలుగు విడుతల పల్లె ప్రగతికి.. ఇప్పటికీ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. పల్లె ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల్లో నిరంతరం పారిశుధ్యం, అభివృద్ధి పనులను కొనసాగించాలన్నారు. రాబోయే వర్షాకాలం సందర్భంగా ప్రజలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచడంతోపాటు పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని వారు పేర్కొన్నారు.