కడ్తాల్, జూన్ 7(ఆమనగల్లు): పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్ అన్నారు. మంగళవారం ఆయన ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో ఎం పీపీ అనిత, జడ్పీటీసీ అనురాధ, అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లెప్రకృతివనం, క్రీడాప్రాంగణం, పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రామంలోని ఇంటింటికెళ్లి పరిసరాల శుభ్రత, మొక్కల పెంపకం, మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటితోపాటు పరిసరాలను ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాల ని, మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం
చేసుకోవాలన్నారు. పల్లెప్రకృతివనం చాలా బాగుందని అధికారులను అభినందించారు. అనంతరం ఆయన గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణా న్ని పరిశీలించి.. కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. ప్రతి ఒక్కరూ పల్లెప్రగతి కార్యక్రమం లో భాగస్వాములై గ్రామాలు, తండాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముం దు ఆయన గ్రామంలోని పల్లెప్రకృతివనం ఎదుట పల్లెప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
నిధులు మంజూరు చేయాలని వినతి..
ఆమనగల్లు మండలాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్కు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పత్యానాయక్ వినతిపత్రం అందజేశారు. మండలంలోని పోలేపల్లి గ్రామం నుంచి ముద్విన్ వరకు, కొనాపూర్ నుంచి రాంనుంతల వరకు, పోలేపల్లి నుంచి కోతకుంటతండా వరకు, శంకరకొండ తండా నుంచి పోలేపల్లి వరకు, ఆకుతోటపల్లి నుంచి సీతారాంనగర్ తండా వరకు బీటీ రోడ్లు, ఆకుతోటపల్లి, శెట్టిపల్లి, మేడిగడ్డతండా, సింగంపల్లి, చెన్నంపల్లి, చింతలపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని కమిషనర్కు వినతిపత్ర అందించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీఏ ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్రెడ్డి, అదనపు పీడీ శ్రీలత, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు రజిత, సోని, మల్లమ్మ, ఎంపీటీసీలు సరిత, మంగమ్మ, నారాయణ, ఎంపీడీవో వెంకట్రాములు, ఏంపీవో శ్రీలత, నాయకులు విజయ్నాయక్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనూనాయక్, పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.