తడిసిన ధాన్యం కొనుగోలు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ‘తడిసిన ధాన్యంపై ఏ ఒక్క రైతూ దిగులు చెందొద్దు.. ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుంది..’ అని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి అండగా నిలుస్తున్న సీఎం.. మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసింది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక రైతన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ ముందుకొచ్చి తడిసిన ధాన్యం కొనుగోలుకు అధికారులను ఆదేశించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, వికారాబాద్ జిల్లాలో 90 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
పరిగి, మే 19 : అకాల వర్షాలతో తడిసిన వడ్లను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ద్వారా తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి చాటుకున్నారు. ఓవైపు కేంద్రం యాసంగి వడ్లు కొనుగోలు చేయబోమని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. సుమారు రూ.3వేల కోట్లకు పైగా నష్టం వచ్చినా సరే ప్రతి రైతు నుంచి వరి ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 111 కొనుగోలు కేంద్రాల ద్వారా 80వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాలో యాసంగిలో 45,690 ఎకరాల్లో వరిపంటను సాగు చేశారు. లక్ష మెట్రిక్ టన్నుల పైగా వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన అధికారులు 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు నిర్ణయించి ఇప్పటికే 90 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 1566 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పోలిస్తే వికారాబాద్ జిల్లాలో వరి సాగు, కోతలు ఆలస్యంగా ఉంటాయి. కొద్ది రోజులుగా వరి కోతలు జరుగుతున్నాయి. రైతులు కోతలు ప్రారంభించి నూర్పిళ్లు చేపడుతున్నారు. అందులో కొంతమంది ధాన్యాన్ని తమ ఇండ్లకు చేరవేయగా, మరికొందరు కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లారు. కొందరు రైతులు తమ ఇండ్లలో ధాన్యం నిలువ ఉంచేందుకు సదుపాయం లేక పొలాల వద్దే ధాన్యం కుప్పలుగా పోసి టార్పాలిన్లు కప్పి ఉంచారు. ఈ దశలో కురుస్తున్న అకాల వర్షాలతో అక్కడక్కడ ధాన్యం తడిసింది. ప్రధానంగా పొలాల వద్ద కల్లాల్లోనే ఉండిపోయిన ధాన్యం కొంతవరకు తడిసింది. టార్బాలిన్లు కప్పి ఉంచినా చివరలకు వాన నీటితో ధాన్యం తడిసింది. వర్షానికి ధాన్యం తడువకుండా ఉంచేందుకు ప్రతి కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు సైతం అందుబాటులో ఉంచారు. మార్కెట్ కమిటీల ద్వారా ఆయా కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లు అందజేశారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని 10 మార్కెట్ కమిటీల ద్వారా 1104 టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాకు మార్కెటింగ్ శాఖ ద్వారా మరో 500 టార్పాలిన్లను తెప్పించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు సమయం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వరకు తమకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ మరోసారి రైతుల ఇబ్బందులు చూసి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చేతికి అందిన తర్వాత విక్రయించేలోపు అకాల వర్షాల వల్ల రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సర్కారు అండగా నిలువడం చాలా గొప్ప నిర్ణయంగా పేర్కొంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడం రైతాంగంలో మరింత మనోధైర్యాన్ని నింపింది.
వరి ధాన్యం తడువకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఉంచడం ద్వారా తడువకుండా చూడాలి. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అకాల వర్షాల వల్ల వరి ధాన్యం తడిస్తే ధాన్యం ఆరబెట్టి తీసుకువస్తే కొనుగోలు చేస్తారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి టార్పాలిన్లు అందజేశారు. ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటేశ్, రైతు, వడిచెర్ల
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. యాసంగిలో పండించిన ధాన్యం కల్లాల్లో ఉండగానే అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనరేమోనని ఆందోళన చెందాం. కానీ ప్రభుత్వం చేసిన ప్రకటన మాకు సంతోషాన్నిచ్చింది.
రైతులను ఆదుకుంటున్నారు
రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పినా రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొంటున్నది. ఇప్పుడు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని ప్రభుత్వం చెప్పడం రైతులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు నష్టపోకుండా ఉంటారు.