కడ్తాల్, మే 19 (ఆమనగల్లు): న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటుకు న్యాయశాఖ కార్యాచరణ రూపొందిస్తున్నదని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్కే భూపతి అన్నా రు. నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాలను కలిపి ఆమనగల్లు మండలంలో నూతనంగా జూనియర్ సివిల్ కోర్టు, మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆమనగల్లు పట్టణంలో కోర్టు ఏర్పాటుకు అవసరమైన పలు భవనాలను తహసీల్దార్ పాండూనాయక్, ఎంపీడీవో వెంకట్రాములు, ఆర్అండ్బీ డీఈఈ అర్జున్, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ అనురాధతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని ఎంపీపీ కార్యాల య ఆవరణలో కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ కార్యాలయ భవనాన్ని, పాత సమావేశ భవనాన్ని, రెండు క్వార్టర్స్లను పరిశీలించారు.
మండల పరిషత్ పాత భవనంతోపాటు, ఎక్సైజ్ శాఖ కార్యాలయం, సిబ్బంది ఓల్డ్ క్వార్టర్స్లు సౌకర్యవంతంగా ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేసి ఆధునీకరించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను జడ్జి ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమనగల్లు పట్టణంలో జూన్ 2వ తేదీ లోపు కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సౌకర్యార్థం, అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని వసతులతో కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన మండలంలోని మైసిగండి మైసమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, ఎస్ఐ ధర్మేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, మైసిగండి ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలీ పంతూనాయక్, పత్యానాయక్, కౌన్సిలర్ రాధమ్మ, ఎంపీటీసీ కుమార్, కల్వకుర్తి బార్ అసోసియేషన్ సభ్యులు ఆంజనేయులు, మల్లేశ్, లక్ష్మీనర్సింహారెడ్డి, శివ, రామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.