సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): ఇంటి నిర్మాణం కోసం నకిలీ అనుమతులు జారీ చేసిన బీజేపీ కార్పొరేటర్ పెండ్యాల నరసింహను సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో 26వ వార్డు కార్పొరేటర్ నరసింహ, ఆయన భార్య శివపార్వతి 2016 ఫిబ్రవరిలో గ్రామపంచాయతీ అనుమతి ఇచ్చినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించి జగన్మోహన్రెడ్డికి ఇల్లు కట్టుకునేందుకు సహకరించారు.
మీర్పేట నంది హిల్స్లోని ప్లాట్ నంబర్ 12లోని 300 గజాల స్థలంలో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం రూ. 2,25,000 తీసుకున్నారు. ఈ ఇంటి నిర్మాణ అనుమతిలో స్థలానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ చార్జీలు వసూలు చేయకపోగా, నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి మార్ట్గేజ్ చేయాల్సి ఉండగా, ఇవేవీ చేయలేదు. అదేవిధంగా మూడంతస్తులు, పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. దీనిపై ఫిర్యాదు రావడంతో మీర్పేట మున్సిపల్ కమిషనర్ ముందుగా షోకాజ్ నోటీస్ జారీ చేసి వివరణ అడిగారు. కార్పొరేటర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో చట్ట ప్రకారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్పొరేటర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.