యాచారం, జనవరి 30: స్థానికంగా లభిస్తున్న తాజా చేపలకు మంచి డిమాండ్ ఉన్నది. చెరువుల వద్ద ప్రతి ఆదివారం జోరుగా చేపల విక్రయాలు సాగుతున్నాయి. దీంతో మత్స్యకారుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. గతంలో స్థానికంగా చెరువులు, కుంటల్లో నీళ్లు లేక, చేపల పెంపకం జాడేలేక మండల ప్రజలకు తాజా చేపలు కరువయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొన్న చేపలను ఐస్ బాక్సు ల్లో నిల్వ ఉంచి విక్రయించేవారు. అవి తాజావి కావని తెలిసినా తప్పని పరిస్థితుల్లో మాంసంప్రియులు కొనుగోలు చేసేవారు. పైగా వాటి ధరలూ ఎక్కువగానే ఉండేవి.
ఇటీవలి కాలంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో మండలంలోని ఆరు పెద్ద చెరువులు, 86 చెరువులు, కుంటలు నిం డి అలుగుపోశాయి. మండలంలోని గొలుసుకట్టు చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకా న్ని ప్రోత్సహించింది. మండలంలోని చెరువుల్లో సామర్థ్యాన్ని బట్టి లక్షకు పైగా చేపపిల్లలను వదిలారు. అవి ప్రస్తుతం పెరిగి పంటకొచ్చాయి. మండలంలోని పెద్ద చెరువుల వద్ద ప్రతి ఆదివారం మత్స్యకారులు చేపలను పట్టి అక్కడే విక్రయిస్తున్నా రు. అక్కడే శుభ్రంగా కడిగి కట్ చేసి ఇస్తున్నారు. దీంతో ప్రజ లు తాజా చేపలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని కుర్మిద్ద పెద్ద చెరువువద్ద ఆదివారం మత్స్యకారులు చేపలు పట్టి విక్రయించారు. చెరువు వద్ద తా జా చేపలు లభించడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో చేపలను కొనుగోలు చేశారు. ఒక్కో చేప కిలో నుంచి రెండు కిలోల బరువు వరకు ఉన్నది. దీంతో ప్రజలు మార్కెట్కు కాకుండా స్థానిక చెరువు వద్ద తాజా చేపలను కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది వ్యాపారులు చెరువుల వద్ద ఒకేసారి చేపలు కొని గ్రామాల్లో తిరుగుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో చికెన్, మటన్తోపాటుగా చేపలు సండే స్పెషల్ వంటకంగా మారింది. పైగా తాజా చేపలు కావడంతో అవి ఎంతో రుచిగా ఉంటున్నాయని ప్రజలు అంటున్నారు. దీంతో మ త్స్యకారులకు మంచి డిమాండ్ ఉన్నది. వారు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
కుర్మిద్ద గ్రామంలోని పెద్దచెరువు, ధర్మపురి చెరువు, మేడిపల్లి ఊరచెరువు, సాలి చెరువుల వద్ద మత్స్యకారులు జోరుగా చేపలు పడుతున్నారు. ఆదివారం మత్స్యకారులు చెరువుల్లో పెంచిన రవ్వ, బొచ్చ, కొర్రమీను చేపల ను పట్టి ప్రజలకు విక్రయించారు. కిలో రూ. 150 చొప్పున చెరువుల వద్దే విక్రయించారు. దీంతో చేపలు తాజాగా లభి స్తుండటంతో కుర్మిద్ద, తాడిపర్తి, నానక్నగర్, మేడిపల్లి, మీర్ఖాన్పేట, మల్కీజ్గూడ, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, ఆకులమైలారం తదితర గ్రామాలనుంచి ప్రజలు చెరువుల వద్దకు వెళ్లి చేపలను కొనుగోలు చేశారు. మండలంలోని తాటిపర్తి బందంచెరువు, నానక్నగర్ తలాబ్ చెరువు, మేడిపల్లి ఎక్వచెరువు, తక్కళ్లపల్లి చెన్నారెడ్డి చెరువు, చింతపట్ల లక్ష్మణచెరువు, నందివనపర్తి కామునిచెరువు, కుర్మిద్ద పెద్ద చెరువు, ధర్మపురి చెరువుల్లో చేపలను జోరుగా పెంచుతున్నారు. చెరువుల వద్దనే పెరిగిన చేపలను పట్టి ప్రజలకు విక్రయిస్తున్నారు. మిషన్ కాకతీయ పథకంతో ప్రభుత్వం చెరువుల్లో పూడిక తీయడంతోపాటు మత్స్యకారులకు తగిన ఉపాధి కల్పించేందుకు చెరువుల్లో సబ్సిడీపై చేపపిల్లలను వదలడంతో ఎంతో మేలు జరిగిందని వారు సంబురపడిపోతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మత్స్యకారుల సొసైటీలకు ప్రభుత్వం మోటార్ సైకిళ్లు, వలలు, ఐస్ బాక్సులు, జీవితబీమా వసతులను కల్పించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు చేపలను వివిధ ప్రాం తాల నుంచి దిగుమతి చేసుకొని విక్రయించే వారు ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు.
చెరువులకు రక్షణ కల్పించాలి
రాష్ట్ర ప్రభుత్వం చెరువులకు రక్షణ కల్పించాలి. మత్స్యకారుల కుటుంబాలకు తగిన రుణ సదుపాయంను కల్పించాలి. చెరువుల్లో చేపలు పెంచడానికి, విక్రయించుకునేందుకు ప్రత్యేక వసతులు కల్పించాలి.
-నీలం శ్రీకాంత్, మత్స్యకారుడు కుర్మిద్ద