ఉద్యోగం, చదువు, వ్యాపారం కోసం నగరానికి వచ్చి స్థిరపడిన వాళ్లు లక్షలాది మంది ఉంటారు. అద్దె ఇళ్లల్లో ఉంటూ తమ కార్యకలాపాలు చూసుకుంటుంటారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ జీవితాన్ని గడుపుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కొవిడ్ పాజిటివ్ వస్తే వారొక్కరే ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉంటుంది. వంట చేసి పెట్టడానికి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండరు. ఉన్న ఒక్కటి, రెండు రూమ్లలో వారొచ్చి సేవలందించే పరిస్థితీ ఉండదు. ఇంటి వద్ద అమ్మ, నాన్న బెంగ.. భయానక పరిస్థితుల్లో బిడ్డ ఒక్కడే ఉంటున్నాడు. ఏం తింటున్నాడో ఏమోననే ఆవేదన వారికి ఉంటుంది. అయితే అలాంటి వారి కోసం నగరంలో హోమ్ ఫుడ్ సంస్థల సేవలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ సేవల గురించి తల్లిదండ్రులకు చెబుతూ.. కొవిడ్ బాధితులు ఇక్కడ క్షేమంగానే ఉన్నామంటూ ధైర్యాన్నిస్తున్నారు.
-సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ)
కాల్ చేస్తే చాలు
కొవిడ్ రోగుల కోసం గ్రేటర్లోని కొన్ని హోమ్ ఫుడ్ సంస్థలు ఇంటి వంటను సిద్ధం చేస్తున్నాయి. ఉదయం అల్పాహారం మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు ఇంట్లో తయారు చేసిన వంటకాలను పేషంట్లకు అందిస్తున్నాయి. కరోనా సోకి ఇంట్లో వంట చేసుకోలేని పరిస్థితులు ఉన్న వారికి హోమ్ ఫుడ్ సంస్థల సేవలు బాగా ఉపయోగపడుతున్నాయి. జస్ట్ ఆర్డర్ ఇస్తే చాలు సమయానికి కావాల్సిన వంటకాలు డోర్ ముందు ఉంటాయి. సరసమైన ధరలతో ఇంటి రుచులు అందిస్తూ ప్రస్తుత కరోనా విపత్కాలంలో వారికి అండగా నిలుస్తున్నారు. గ్రేటర్లో ఈ తరహా సేవలందించడానికి వందల సంఖ్యలో హోమ్ ఫుడ్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. వారం, పదిహేను, నెల రోజులు.. ఇలా ప్యాకేజీల వారీగా చార్జ్జ్ చేస్తారు. పూర్తిగా కరోనా పేషెంట్ల కోసం కావాల్సిన పోషకాహారం సిద్ధం చేసి వారికి అందిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనిటీ పెంచే వంటకాలే ప్రధానం. కొవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం. కోరుకున్న ప్యాకేజీలో హైజీన్ తయారీతో వంటకాలు సిద్ధం చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల కోసమే అన్నట్లుగా..
కరోనా నుంచి మా సేవలు విస్తృతం చేశాం. హోమ్ ఫుడ్ సర్వీస్కు చాలా స్పందన వస్తుంది. ముఖ్యంగా కొవిడ్ నుంచి కోలుకోవడంలో ఆహారానిది కీలకపాత్ర. పోషకాహారం చాలా ముఖ్యం. అది హైజీన్గా ఉండాలి. మన కుటుంబ సభ్యులే తింటున్నారనే భావనతో వంటకాలు సిద్ధం చేయాలి. అట్లాంటి సర్వీస్నే మేం అందిస్తున్నాం. మా కస్టమర్లు కొవిడ్ నుంచి త్వరగా బయటపడేలా వారికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేసి పంపిస్తున్నాం. ఇప్పటికే 20 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆర్డర్స్ దృష్ట్యా మరికొందరిని ఉద్యోగాల్లో నియమించుకున్నాం. నగరవాసులు చాలా మంది హోమ్ ఫుడ్ను ఇష్టపడుతున్నారు. బేకరీ ప్రొడక్ట్స్లో కూడా కస్టమర్లు ఇష్టంగా తినేలా ఇమ్యూనిటీ ఐటెమ్లు తయారు చేశాం.
-దివ్యాసాగర్ మల్లెల, ఫౌండర్, రెనీ ఫుడ్స్ అండ్ బేకర్స్.
నాణ్యమైన ఆహారం అందిస్తాం
కొవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ మీల్స్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వారం, 14 రోజుల ప్యాకేజీలను అందిస్తున్నాం. పప్పు, సాంబార్, కర్రీ వెజ్, నాన్వెజ్, 2 పుల్కాలు, రైస్, సలాడ్ ఇలా మెనూ ఉంటుంది. అన్ని జాగ్రత్తలతో ఇంట్లో వంటకాలను సిద్ధం చేస్తుంటాం. కస్టమర్స్కు కావాల్సిన ఆర్డర్ను నిర్ణీత సమయం లోపు చేరవేస్తాం. కస్టమర్ ఎలాంటి డైట్ కోరినా మేం దానిని సిద్ధం చేసి అందిస్తాం. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాం.
-రష్మీజాలీ, ఫౌండర్, చెఫ్జాలీ.
కొవిడ్ బాధితులు కోలుకోవడమే ముఖ్యం
కొవిడ్ బాధితులు త్వరగా కోలుకోవడమే మాకు కావాల్సింది. అందుకోసం వారికి కావాల్సిన ఇమ్యూనిటీ ఫుడ్ను అందిస్తున్నాం. అందరికి అందుబాటులో ఉండేలా ప్యాకేజీ ధరలను నిర్ణయించాం. చాలా మంది ఆర్డర్స్ ఇస్తున్నారు. ఫుడ్ అందించడంతో పాటు వారు కోలుకునేలా వారి ఆరోగ్య వివరాలు కూడా తెలుసుకుని ధైర్యం చెబుతున్నాం. వారికి ఏం తినాలని అనిపించినా ఆ వంటకం మేం రెడీ చేసి పంపిస్తున్నాం. హోం ఫుడ్ రుచులతో ఇంట్లో తింటున్నామనే భావన కలుగుతుంది.
-మాన్సీ కపూర్, ఫౌండర్, మామ్స్ కిచెన్.