యాచారం, మే 2 : మండల కేంద్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పంచాయతీ మధ్యాహ్నం తరువాత వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించింది. పంచాయతీ నిబంధనలను పాటిస్తూ నాలుగు రోజులుగా వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. దవాఖానాలు, మెడికల్ షాపులు మినహా మధ్యాహ్నం 2గంటలు వివిధ రకాల వ్యాపార సంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా బంద్చేస్తూ కరోనా నియంత్రణకు తమ వంతు సహకరిస్తున్నారు. ప్రజలు సైతం పనులు మధ్యాహ్నం రెండు గంటల లోపే పూర్తి చేసుకుంటున్నారు. సాగర్ రహదారిపై ప్రజల రద్దీ ఘననీయంగా తగ్గడంతో పాటుగా నిర్మానుష్యంగా మారుతున్నది. నిబంధనలు పాటిస్తూ క్రయ, విక్రయాలు నిర్వహించుకోవాలని కోరారు. బంద్ నిబంధనలు ఉల్లంఘిస్తే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని తెలిపారు.
పాలక మండలి ఏకగ్రీవ తీర్మానం..
కడ్తాల్ మే 2 : పంచాయతీ పాలక మండలి సభ్యులు, వ్యాపారస్తులు చేసుకున్న తీర్మానం మేరకు మండల కేంద్రంలో స్వచ్ఛంద బంద్ కొనసాగుతున్నది. కరోనా విస్తరించకుండా ఉండేందుకు దుకాణాదారులు, పంచాయతీ పాలక మండలి సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని స్వచ్ఛంద బంద్కి తీర్మానించారు. మండల కేంద్రంలో ప్రజలు పంచాయతీ తీర్మానాన్ని పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు తెరుచుకున్న షాపులు మధ్యాహ్నం 2 గంటలకే మూతబడ్డాయి. ఈ నెల 10 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందన్నారు.