ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 26 : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ పెద్దన్నలా అండగా నిలబడుతున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలోని 131 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.1,31,15,196 విలువ చేసే చెక్కులను ఇబ్రహీంపట్నం బాలాజీ గార్డెన్లో శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ప్రతి పేదింటి ఆడబిడ్డ వివాహానికి గొప్ప మనస్సుతో లక్షానూటపదహార్లు అందజేయడం ఎంతో సంతోషకరమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి ఆడబిడ్డల పెండిళ్లు చేస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై ఇతర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు వారి రాష్ర్టాల్లో అమలుచేసేందుకు, మంత్రుల వద్ద సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెండ్లిళ్లు ఆర్భాటంగా చేసి అప్పులుపాలు కావద్దని సూచించారు. ఈ పథకం ద్వారా ఆడపడుచులు సంతోషంగా అత్తారింటికి వెళ్లున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్లు స్రవంతి, ఆర్థిక, వైస్ చైర్మన్ యాదగిరి, తహసీల్దార్ అనిత, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు వెంకట్రెడ్డి, జంగయ్య, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులున్నారు.