పరిగి, ఫిబ్రవరి 25: అన్ని హంగులతో కూడిన పాఠశాలలుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమం ‘మన ఊరు-మన బడి’ అమల్లో మరో ముందడుగు పడింది. క్షేత్ర స్థాయిలో ఆయా పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అవగాహన చేసుకొని, ఎలాంటి పనులను చేపట్టాలనే అంశాలపై అంచనాలను రూపొందించేందుకు ఇంజినీరింగ్ అధికారులు పర్యటనలు చేపడుతున్నారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ఈ ఏడాది జిల్లా లో అత్యధిక విద్యార్థులు ఉన్న 371 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఆ బడుల్లో మౌలిక వసతులను కల్పించనున్నారు. జిల్లా పరిధిలో 1,058 పాఠశాలలున్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలు-764, ప్రాథమికోన్నత పాఠశాలలు-116, ఉన్నత పాఠశాలలు-174, టీఎస్ఎంఎస్లు-9, కేజీబీవీలు-18, టీఎస్ గురుకులాలు 26 ఉన్నాయి. మండలాన్ని యూ నిట్గా తీసుకుని అత్యధిక విద్యార్థులు ఉన్న (35శాతం)పాఠశాలలను మొదటి విడుతలో అధికారులు ఎంపిక చేశారు. మార్చి తర్వాత రెండో విడుత పాఠశాలల ఎంపిక జరుగనున్నది.
పాఠశాలల్లో ఎలాంటి వసతులున్నాయి.. ఇంకా ఎలాంటి వసతులను కల్పించాలి..ఇంకా చేపట్టా ల్సిన మరమ్మతులకు సంబంధించిన విషయాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ఇంజినీరింగ్ శాఖ అధికారులు, ఎంఈవోలు, మండల ప్రత్యేకాధికారులు పాఠశాలల్లో పర్యటిస్తున్నారు. ప్రతి పాఠశాలలో ఉన్న వసతులు, వాటి పరిస్థితిపై ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒక్కో గదికి సంబంధించిన ఎనిమిది ఫొటోలను తీసి ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయినప్పటికీ క్షేత్ర స్థాయి లో పర్యటించడం ద్వారా తరగతి గదుల పరిస్థితి, ప్రహరీలు లేకుంటే ఎన్ని మీటర్ల్ల ప్రహరీలు నిర్మించాలి, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తైతే వాటికి నీటి వసతి కల్పించడం, లేని బడుల్లో కొత్తగా ఎన్ని మరుగుదొడ్లను నిర్మించాలి, తరగతి గదుల్లో ఏమైనా మరమ్మతులు చేపట్టాల్సి వస్తే ఎంత మేరకు చేపట్టాల్సి ఉంది, అదనపు తరగతి గదులు ఎన్ని అవసరమవుతాయి, వాటి కి ఎంత ఖాళీ స్థలం ఉన్నది పరిశీలించడం, అలాగా జడ్పీహెచ్ఎస్లల్లో డైనింగ్హాళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలం ఉందా..? అన్ని బడుల్లోనూ స్టోర్రూమ్, కిచెన్షెడ్లు నిర్మించాల్సి ఉం డటంతో స్థలం ఎంత ఉన్నది.. ప్రస్తుతం ఉన్న వసతులు ఎంతమేరకు ఉపయోగంలో ఉన్నా యి, మిగతా ఏ రకమైన వసతులను కల్పించాల్సి ఉంది తదితర విషయాలను స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలిసి సంబంధిత పాఠశాలల్లో కల్పించాల్సిన వసతులపై నోట్ చేసుకుంటున్నారు.
ఈ పర్యటనలు పూర్తయిన తర్వాత సంబంధిత పనులకు సంబంధించిన అంచనాలను ఇంజినీరింగ్ అధికారులు రూపొందించి పరిపాలన అనుమతుల కోసం జిల్లా కలెక్టర్కు సమర్పిస్తా రు. అనంతరం సాంకేతిక అనుమతులను కూడా ఆయా ఇంజినీరింగ్ శాఖల అధికారులే ఇస్తారు. రూ.30లక్షల వరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు సూపరింటెండింగ్ ఇంజినీర్, రూ.2 కోట్లు పై బడిన పనులకు చీఫ్ ఇంజినీర్ సాంకేతిక అనుమతులను ఇస్తా రు. గదులు, మరుగుదొడ్లు, కిచెన్షెడ్లు, ప్రహరీలు, డైనింగ్హాళ్లను ఏ విధంగా నిర్మించాలనే విషయాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో నమూ నాలు, కొలతలతో కూడిన వివరాలను విద్యాశాఖ అధికారులకు పంపించింది.
అంతేకాకుండా గ్రంథాలయ సంస్థ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు సైతం చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా విద్యార్థులకు గ్రంథాలయాల్లో పుస్తకాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా ఆయా పాఠశాలల్లో చేపట్టాల్సిన వసతులను సంబంధించిన అంచనాల తయారీ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని ఉన్నతాధికారులు వారికి సూచించారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో ‘మన ఊరు-మన బడి’ కింద మొదటి విడుతలో ఎంపికైన 371 పాఠశాలల్లో చేపట్టాల్సిన వసతుల కల్పన కు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలను ఐదు ఇంజినీరింగ్ శాఖలకు అధికారులు కేటాయించారు. నీటి పారుదల శాఖకు దోమ మం డలంలోని 25 పాఠశాలలు, కులకచర్లలోని 26 పాఠశాలలు, మిషన్ భగీరథ(ఆర్డబ్ల్యూఎస్)కు బషీరాబాద్లోని 22 పాఠశాలలు, బొం రాస్పేట్లోని 25 బడులు, చౌడాపూర్లోని 14 స్కూళ్లు, పూడూరులోని 17బడులు, తాండూరులోని 25 పాఠశాలలు, పంచాయతీరాజ్ శాఖకు దౌల్తాబాద్లోని 24 పాఠశాలలు, పరిగిలోని 23 పాఠశాలలు, కోట్పల్లిలోని 9 బడులు, మోమిన్పేట్లోని 19 స్కూళ్లు, బంట్వారంలోని 7 పాఠశాలలు, రోడ్లు,భవనాల శాఖకు ధారూర్లోని 19 పాఠశాలలు, కొడంగల్లోని 19బడులు, మర్పల్లిలోని 17 స్కూళ్లు, వికారాబాద్లోని 24 పాఠశాలలు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీకు పెద్దేముల్లోని 20 పాఠశాలలు, నవాబుపేట్లోని 15 బడులు, యాలాల్లోని 21 పాఠశాలలను అధికారులు కేటాయించారు.