పరిగి, ఫిబ్రవరి 16 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థులకు నాణ్యమైన విద్య, అవసరమైన వసతుల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 19 మండలాల్లో మొదటి విడుతలో ఎంపికైన 371 పాఠశాలలు అధికారులు వెంటనే సందర్శించి ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. ఎంపికైన పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన 12 అంశాలైన తాగునీరు, విద్యుద్దీకరణ, ఫర్నిచర్, మరుగుదొడ్లు, గ్రీన్చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్హాల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించి అంచనాలు పారదర్శకంగా సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ నిర్మాణ పనులకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టాలన్నారు. నిర్వాహణ కమిటీల ద్వారా రెండు బ్యాంకు ఖాతాలను తెరువాలని, ఒకటి శాఖాపరమైన ప్రభుత్వ నిధుల కోసం, మరొకటి దాతల నుంచి సేకరించిన నిధుల కోసమన్నారు. పాఠశాల అవసరాలకు సంబంధించి అంచనా, చెల్లింపులు ప్రతి అంశం జంక్ కమిటీల తీర్మానం ద్వారా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. చేపట్టిన పనులకు సోషల్ ఆడిట్ ఉంటుందని, రికార్డులు జాగ్రత్తగా నిర్వహించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు అన్ని హంగులతో అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డీఆర్డీవో కృష్ణన్, ఇంజినీరింగ్ అధికారులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.