పరిగి, అక్టోబర్ 25 : 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి గ్రామంలో ఏ పని చేపడుతారు, అంచనా వ్యయం ఎంత, ఎన్ని రోజులు పని లభిస్తున్నది… తదితర విషయాలను పొందుపరుస్తూ ముందస్తుగానే ప్రణాళికను రూపొందించి ఆమోదం కోసం గ్రామస్థాయిలో పనుల గుర్తింపు కొనసాగుతున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో 2,00,382 జాబ్కార్డులు ఉన్నాయి. తద్వారా జిల్లా వ్యాప్తంగా 4,38,425 మంది కూలీలు ఉన్నారు. వీరిలో సుమారు 1,80,306 మందికి ఈ ఏడాది 48 లక్షల పని దినాలు కల్పించబడ్డాయి. ఇదిలావుండగా రాబోయే ఆర్థిక సంవత్సరం 2023-24లో జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాల వారీగా ఎంత మంది కూలీలు, ఎన్ని పనులు, ఎన్ని రోజులు ఉపాధి లభించనున్నదన్న దానిపై ప్రణాళికను రూపొందిస్తున్నారు.
అక్టోబర్ 2 నుంచి ప్రారంభమైన గ్రామసభలు..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసేందుకు వీలుగా ప్రతి గ్రామంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామసభలు ప్రారంభమయ్యాయి. జిల్లా పరిధిలో 566 గ్రామపంచాయతీలు ఉండగా, ప్రతి గ్రామపంచాయతీ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల్లో వచ్చే ఏడాది ఏ పనులు చేపట్టాలన్నదానిపై చర్చించారు. ఆయా గ్రామాల్లోని రైతుల కోరిన మేరకు చేపట్టే పనులను సైతం గుర్తించనున్నారు. వచ్చే సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ప్లాన్కు గ్రామసభ ఆమోదం పొంది తదుపరి కార్యాచరణ రూపొందిస్తారు. ఉపాధి హామీ పథకం కింద 150 రకాల పనులు చేపట్టేందుకు అవకాశం ఉన్నది. ఆయా గ్రామాల్లో అవసరమైన, రైతుల కోరిక మేరకు పనులను నిర్ణయించి జాబితా తయారు కొనసాగుతున్నది. అనంతరం మరోసారి గ్రామసభ నిర్వహించి గ్రామంలో వచ్చే ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ కింద ఏ పనులు చేపట్టాలన్నదానిపై గ్రామసభలో ఆమోదిస్తారు. అనంతరం మండల స్థాయి, జిల్లాస్థాయి ఆమోదం అనంతరం ప్రభుత్వానికి నివేదికను పంపిస్తారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో చేపట్టే పనులకు సంబంధించిన గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది.
కేంద్రం కొర్రీలతో 20 పనులే..
ప్రతి కూలీకి పని కల్పించడమే ఉపాధి హామీ పథకం లక్ష్యం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఆదేశాలతో ఒక గ్రామంలో ఏక కాలంలో 20 పనుల కంటే ఎక్కువగా కొనసాగించే అవకాశం లేదు. చేపడుతున్న 20 పనుల్లో ఒక పని పూర్తయిన తర్వాతే 21వ పని చేపట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఉపాధి హామీ పనులు వేసవిలో పెద్ద మొత్తంలో కొనసాగుతాయి. మిగతా సమయాల్లో వ్యవసాయ పనుల వల్ల కూలీలు ఉపాధి హామీ పనులు చేసేందుకు తక్కువ సంఖ్యలో వస్తారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి హామీ పనులకు వస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీ నుంచి ఉపాధి పనులకు కూలీల సంఖ్య పెరుగుతుంది. ఏప్రిల్, మే రెండు నెలల్లో పనులు పెద్ద ఎత్తున కొనసాగుతాయి. ఈ సమయంలో ఒక గ్రామంలో పనుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకే సమయంలో 20 పనులే చేపట్టాలనే నిబంధన పనులు కల్పించడానికి ప్రతిబంధకంగా మారనున్నది. దీన్ని అధిగమించేందుకు వ్యక్తిగతంగా కల్పించే పనులు కాకుండా కూలీలు ఎక్కువ మంది చేపట్టే పనులు చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
గ్రామాల్లో కొనసాగుతున్న పనుల గుర్తింపు
జిల్లా పరిధిలోని గ్రామాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద చేపట్టే పనుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్నది. పనుల గుర్తింపు తర్వాత మరోసారి గ్రామసభల్లో వాటి ఆమోదం పొంది, ఎంత మందికి, ఎన్ని రోజులు పనిదినాలు కల్పించేది మండల, జిల్లాస్థాయి కమిటీల ఆమోదం అనంతరం కార్యాచరణ పూర్తి కానున్నది. రైతులు కోరిన పనులు చేపట్టేలా గ్రామాల్లో పనుల గుర్తింపు జరుగుతున్నది.
– కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా