పరిగి, ఆగస్టు 10 : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నది. ప్రతి ఇంట్లో పండుగ వాతావరణంలో వజ్రోత్సవాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. వజ్రోత్సవాల్లో అత్యంత ప్రధానమైన కార్యక్రమం ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి. దీనికి ప్రభుత్వమే ప్రతి ఇంటికి జాతీయ జెండా అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 2,47,692 ఇండ్లు ఉన్నట్లు గుర్తించి ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రతి గ్రామానికి జాతీయ జెండాలు అందజేసి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీని ప్రారంభించారు.
ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని 12వ తేదీ లోగా పూర్తి చేయనున్నారు. గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఉద్యోగులు జెండాలను ఇంటింటికీ తిరిగి అందజేస్తున్నారు. జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో బుధవారం సాయంత్రానికి 61,316., నాలుగు మున్సిపాలిటీల్లో 15,712 జెండాలను అందజేశారు. ఇంటింటికీ జెండాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. 13వ తేదీ నుంచి ప్రతి ఇంటిపై తప్పనిసరిగా జాతీయ జెండా ఎగురవేయాలి.
– కె.జానకీరెడ్డి, వికారాబాద్ జడ్పీ సీఈవో
జిల్లావ్యాప్తంగా ఈ నెల 12 వరకు ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో జెండాలు ఇంటింటికీ అందజేసే కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో 2,47,692 ఇండ్లకు జెండాలు అందజేయనున్నారు. ఈ నెల 13 నుంచి జాతీయ జెండాను ఇంటింటిపై తప్పనిసరిగా ఎగురవేయాలి.