పెద్దఅంబర్పేట, జూలై 21: ఒకప్పుడు ముళ్ల చెట్లతో నిండిన ప్రదేశం ఇప్పుడు మైదానంగా మారింది. విష పురుగులు వస్తాయని తల్లిదండ్రులు భయపడిన చోటే ఇప్పుడు వారి పిల్లలు ఆడుకునేందుకు వేదికైంది. మున్సిపాలిటీలోని కుంట్లూరువాసులు క్రీడలు ఆడుకునేందుకు గ్రౌం డ్ సిద్ధమైంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవ స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులతో మైదానం అం దుబాటులోకి వచ్చింది. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు ఉండాలన్న సర్కారు సదుద్దేశం సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రభుత్వం నిధులను సకాలంలో మంజూరు చేయడంతో ఎకరం స్థలంలో అనుకున్న చోట రెండు ఎకరాల్లో మైదానం ఏర్పాటైంది. ఉదయం వాకింగ్ కోసం ఎక్కడికెళ్లాలి? అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. అయ్యో పిల్లలు ఎక్కడ ఆడుకుంటారో.. కనీసం ఆడుకునేందుకు వసతుల్లేవే అనే బెంగ పడాల్సిన పనిలేదిక.
ఒక్కొక్కటిగా వసతుల కల్పన
22వ వార్డులో కౌన్సిలర్ చెవుల హరిశంకర్ చొరవతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గతంలోనే కుంట్లూరులో క్రీడా మైదానం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపికచేశారు. కాగా ఈ స్థలం వివాదంలో ఉండటంతో ఎమ్మెల్యే కిషన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇటీవల స్వయంగా ఆయనే క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించారు. ప్రాంగణంలో మరిన్ని వసతులను కల్పిస్తానని హామీ ఇచ్చారు. అప్పుడే మహిళల కోసం ప్రత్యేక వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
క్రీడాప్రాంగణంలో వాలీబాల్ ఆడేందుకు వీలుగా నెట్ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 20 మంది యువకులు ప్రతిరోజూ తెల్లవారుజామునే క్రీడా ప్రాంగణానికి చేరుకుని వాలీబాల్ ఆడుతున్నారు. ఎంతోమంది మహిళలు ఉదయమే వాకింగ్ కోసం ఈ మైదానానికి వస్తున్నారు.
ఇక చిన్నారుల సందడి అంతాఇంతా కాదు. సెలవులొస్తే చాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే హడావిడి. పిల్లలు ఖోఖో ఆడేందుకు ఇప్పటికే గుంజలు ఏర్పాటు చేశారు. లాంగ్ జంప్ కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యా యామం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. రెండెకరాల విస్తీర్ణంలో క్రీడాప్రాంగణం ఉండటం తో పిల్లలు ఆడుకునేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. మహిళలు, వృద్ధులు సైతం వాకింగ్ చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రాంగణానికి చుట్టూ సిమెంట్ కడీలతో ప్రహరీ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనివల్ల పశువులు, వాహనాలు లోపలికి రాకుండా ఉంటాయి. పిల్లలు ఆడుకునే సమయంలో ఎలాంటి అంతరాయం ఉండదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మై దానంతో చాలా సంతోషంగా ఉన్నామని యువకులు పేర్కొంటున్నారు.
ఎప్పుడూ అనుకోలేదు..
ఇక్కడ క్రీడాప్రాంగణం ఏర్పాటవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఏడాది కిందటి వరకు ఇక్కడ ముళ్లపొదలు ఉండేవి. విష పురుగులు వస్తాయని తల్లిదండ్రులు భయపడే వారు. కానీ, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవతో ఈ ప్రదేశం అంతా మారిపోయింది. పిల్లలు, యువకులు ఆడుకునేందుకు వీలుగా క్రీడాప్రాంగణం ఏర్పాటైంది. ప్రతిరోజూ చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉదయం సమయంలో వాకింగ్ చేస్తున్నారు.
– చందు, యువకుడు కుంట్లూరు
మరిన్ని వసతులు కల్పిస్తా
క్రీడాప్రాంగణం ఏర్పాటుకు ఎంతో కృషి చేశా. ఎమ్మెల్యే కిషన్రెడ్డి చొరవతోనే అది సాధ్యమైం ది. గ్రౌండ్లో మరిన్ని వసతులు కల్పిస్తా. మహిళల కోసం ప్రత్యేక వా కింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయిస్తా. చిన్నారులు, యువకులు ఆడుకునేందుకు మరిన్ని పరికరాలను తీసుకొస్తా. క్రీడా ప్రాంగణం చుట్టూ పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటా.
– చెవుల హరిశంకర్, 22వ వార్డు కౌన్సిలర్, పెద్దఅంబర్పేట