రంగారెడ్డి, జూలై 17 (నమస్తే తెలంగాణ): చెరువులకు గండ్లు పడే రోజులకు కాలం చెల్లింది. గతంలో వానకాలం వస్తే చాలు చెరువుల్లో నీటి నిల్వల కంటే గండి పడి చెరువుల్లోని నీరంతా పోయే సందర్భాలే ఎక్కువగా ఉండేది. గత పాలకులు చెరువులను పూర్తిగా గాలికి వదిలేయడం, ఎలాంటి పునరుద్ధరణ పనులకు నోచుకోకపోవడం గమనార్హం. దీంతో ప్రతి ఏటా చెరువులు నిండి గండిపడినప్పటికీ చెరువుల పునరుద్ధరణకు ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడంతో సంబంధిత అధికారులు కూడా చేతులెత్తేసేవారు. జిల్లాలో ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు, బొంగులూరులోని జిలాన్ఖాన్ చెరువు, అరుట్లలోని పడమటి చెరువు, పెద్దబంధం, చిన్నబంధం, చింతపట్లలోని లక్ష్మణ చెరువు, షాబాద్లోని పహిల్వాన్, చందన్వెల్లి పెద్ద చెరువు తదితర చెరువుల కింద వేల ఎకరాలకు నీరందించే వెసులుబాటు ఉన్నప్పటికీ గండ్లు పడి సంబంధిత చెరువుల్లోని సగానికిపైగా నీరు వృథాగా పోయే దయనీయ పరిస్థితి ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ కాకతీయతో జిల్లాలోని చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. చెరువే రైతులకు బతుకుదెరువుగా మారింది. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పనులను చేపట్టి రైతాంగంలో కొత్త ఆశలను చిగురించేలా చేశారు. కబ్జాలకు గురైన చెరువులు, నామరూపాల్లేకుండా పోయిన చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులు తిరిగి జీవం పోసిందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మిషన్ కాకతీయ పనులతో చెరువులకు చుట్టూ కట్టల నిర్మాణం కూడా పకడ్బందీగా నిర్మించడంతో ఐదేండ్లుగా చుక్క నీరు కూడా చెరువుల నుంచి వృథాగా బయటకు వెళ్లడం లేదు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 2339 చెరువులుండగా, 69వేల ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది.
గండ్లకు చెక్.. నిండుగా చెరువులు
జిల్లావ్యాప్తంగా 2339 చెరువులుండగా,.. 69,197 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. జిల్లాలోని ఆయా డివిజన్లోని చెరువులకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్లో 875 చెరువులుండగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 141, హయత్నగర్లో 7, ఇబ్రహీంపట్నంలో 122, మంచాలలో 301, యాచారంలో 137, సరూర్నగర్లో 5, బాలాపూర్లో 48, మాడ్గులలో 114 చెరువులున్నాయి. శంషాబాద్ సబ్ డివిజన్లో 579 చెరువులుండగా 14,942 ఎకరాల ఆయకట్టు ఉన్నది. చేవెళ్ల డివిజన్లో మొత్తం 306 చెరువులుండగా 9671 ఎకరాల ఆయకట్టు ఉన్నది. షాద్నగర్ డివిజన్లో 579 చెరువులుండగా 19,996 ఎకరాల ఆయకట్టు ఉన్నది. మరోవైపు మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువుల పునరుద్ధరణ పనులతో కృష్ణా జలాల్లో మన వాటా జలాలు మనం వాడుకునే అవకాశం కూడా కలుగుతున్నది. జిల్లాలో చేపట్టిన పూడికతీత పనులతో కనీసం 5 టీఎంసీలకు పైగా వృథాగా పారే కృష్ణా జలాలను ఒడిసి పట్టే అవకాశం కలుగుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు అన్ని చెరువులకు మిషన్ కాకతీయలో భాగంగా మరమ్మతులు చేయడంతో చెరువులు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయి. గతంలో సగటున 80 ఎకరాలకు నీరందించే చెరువు సుమారు 200 ఎకరాలకు నీరందించే స్థితికి చేరుకున్నాయి. జిల్లాలోని మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులతో కనీసం 650 మిలియన్ క్యుబిక్ ఫీట్ల (5 టీఎంసీల)వృథాగా పారే కృష్ణా జలాలు చెరువుల్లో నిల్వ చేసుకునే అవకాశం ఉన్నట్లు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
భూగర్భజలాలు పెరిగాయి..
టీఆర్ఎస్ సర్కార్ చెరువులు, కుంటల్లో కూరుకుపోయిన మట్టిని తొలగించటంతో పాటు చెరువుకట్టల మరమ్మతులు చేపట్టడం ద్వారా నేడు చెరువులు, కుంటల్లోని నీరు వృథా పోకుండా ఉంటున్నాయి. దీంతో చెరువులు, కుంటల ఆయకట్టు సమీపంలోని బోరుబావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది.
– మొద్దు అంజిరెడ్డి, రైతు, శేరిగూడ
వ్యవసాయం సస్యశ్యామలం
ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో వ్యవసాయం సస్యశ్యాలమమైంది. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా రూ. 7కోట్లతో షాబాద్ పహిల్వాన్ చెరువును మినీట్యాంక్బండ్గా అభివృద్ధి చేశారు. మూడేండ్ల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువు నీటితో కళకళలాడుతున్నది.
– పి.స్వప్నానర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, షాబాద్