ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 11 : రంగారెడ్డిజిల్లాలో మామిడిపూత ఈ ఏడాది పుష్కలంగా పూసింది. మామిడిపూత అత్యధికంగా రావడంతో మామిడి సాగు చేసిన రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 22వేల ఎకరాల్లో మామిడిసాగు ఉండగా అన్ని ప్రాంతాల్లో మామిడిపూత విస్తారంగా వచ్చింది. దీంతో ఈ సంవత్సరం మామిడి దిగుబడి కూడా అత్యధికంగా వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, ఆమనగల్లు, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మామిడి తోటలున్నాయి. పూతరాలడాన్ని అరికడితే మామిడి దిగుబడులు గణనీయంగా వచ్చే అవకాశం ఉందని, దీనికి యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.
మామిడి సాగుకు అనుకూలమైన నేలలు..
మామిడి సాగుకు అన్ని నేలలు అనుకూలం. కానీ, చౌడు, నీరు నిలువ ఉండే బరువైన నల్లరేగడి నేలల్లో నాటకూడదు. లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్లు, అభివృద్ధిచెంది చాలాకాలం ఫలాలనిస్తాయి. భూసార పరీక్షల ఆధారంగా పోషకాల లభ్యతను పరిగణనలోకి తీసుకుని, సిఫారసు చేసిన ఎరువులను వాడుకోవాలి.
ఫిబ్రవరి చివరివారంలో లేదా మార్చి మొదటివారంలో పిందె ఏర్పడిన తరువాత సిఫారసు చేసిన ఎరువుల్లో నాలుగో భాగం మొక్కకు అదనంగా ఇవ్వడం ద్వారా ఎక్కువ దిగుబడి పొందడమే కాకుండా తర్వాత సంవత్సరపు కాపుకు దోహదపడుతుంది. మామిడి మొక్కల పెరుగుదలకు, నాణ్యమైన దిగుబడులకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యం. సూక్ష్మపోషక లోపాలను నేలలో వాటికి సంబంధించిన ఎరువులు వేసుకుని లేదా సిఫారసు ప్రకారం ముందు ద్రావణాన్ని చెట్లపై పిచికారీ చేసుకుని నివారించుకోవాలి.
జింకు లోపం సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా కనిపిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచింస్తున్నారు. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందికి ముడుచుకుని పోతాయి. ఆకులు గులాబీ రేకుల వలే గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి, కాయలు, పెరుగుదల నాణ్యత దిగుబడి తగ్గిపోతుంది. బోరాన్ లోపం గల చెట్ల ఆకులు కురచబడి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా తయారవుతాయి. కాయదశలో, కాయ పగుళ్లు, చూపడం సాధారణంగా కనిపించే లక్షణం. ఇనుపధాతు లోపంగల చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా మారిపోతాయి. ఆకుల సైజు తగ్గిపోయి తీవ్రమైన లోపం ఉన్న మొక్కల ఆకులపై నుంచి కిందికి ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నం ఉన్న నేలల్లో సాధారణంగా కనబడుతున్నది.
సూక్ష్మ లోపాలు అధికంగా ఉన్న తోటల్లో చెట్టుకు 50 నుంచి 75గ్రాముల బోరాక్స్, 125 నుంచి 150గ్రాముల జింక్ సల్ఫేట్, 125 నుంచి 150గ్రాముల మెగ్నీషియంసల్ఫేట్ జూలై, ఆగస్టు నెలల్లో పాదులో వేయాలి. జింక్, బోరాన్లోప తక్షణ నివారణకు 1 గ్రాము చీలెటెడ్ జింకు, 1.25గ్రాముల బోరాన్, 19శాతం లీటర్ నీటిని 125గ్రాముల బోరాన్ను వందలీటర్ల నీటిలో కలిపి కొత్త చిగురు వచ్చేటప్పుడు, మొగ్గ పెరుగుదల దశలో ఉన్నప్పుడు చెట్లు బాగా తడిసేటట్లు విరివిగా చేయాలి. ఇనుపధాతులోప నివారణకు 2.5గ్రామ అన్నబేది, 1 గ్రామ నిమ్ముప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటర్ నీటిలో కలిపి 15రోజుల వ్యవధిలోనే రెండుసార్లు పిచికారీ చేయాలి.
మామిడిపూత ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉన్నందున రైతులు సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. పూతరాలకుండా జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడి అధిక మొత్తంలో వస్తుంది. ముఖ్యం గా మామిడిరైతులు ఎప్పటికప్పుడు ఉద్యానవనశాఖ అధికారుల సూచనలు, సలహాలను తీసుకుని పంటలను కాపాడుకోవల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయశాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
– సునందారెడ్డి, ఉద్యానవన జిల్లా అధికారి