బొంరాస్పేట, ఫిబ్రవరి 11 : మండలంలోని చిల్ముల్మైలారం గ్రామంలో అంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలే. చుట్టు పక్కల తండాలు కూడా ఉన్నాయి. తమ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, బంగారు భవిష్యత్ ఉండాలని తల్లితండ్రులు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలన్న తపనతో కాయకష్టం చేసి వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలకు పంపించేవారు. కానీ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో ప్రైవేటుకు స్వస్తి పలికి.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు బాగా పెరిగాయి. ఐదేండ్ల నుంచి ఉపాధ్యాయులు విజయవంతంగా ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు.
చిల్ముల్మైలారం యూపీఎస్లో 9వ తరగతి వరకు ఉన్నది. పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించక ముందు 220 మంది విద్యార్థులు ఉండేవారు. కొడంగల్లోని పలు ప్రైవేటు పాఠశాలలకు గ్రామం, తండాల నుంచి సుమారు వంద మంది వరకు వెళ్లేవారు. 2017లో పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించాలని ఎస్ఎంసీ సమావేశం ఏర్పాటు చేసి తల్లిదండ్రులు తీర్మానం చేశారు. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 2017-18 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 5వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 358కి పెరిగింది. ఇందులో 212 మంది ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటుండగా, 146 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం 1వ తరగతిలో 51 మంది, 2వ తరగతిలో 32, 3వ తరగతిలో 49, 4వ తరగతిలో 35, 5వ తరగతిలో 45 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించడంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా సగానికిపైగా తగ్గింది. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సరఫరా చేసింది.
సికింద్రాబాద్ రోటరీ క్లబ్ వారు పాఠశాలను 2020లో హ్యాపీ స్కూల్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు 40 బెంచీలు, లైబ్రరీ పుస్తకాలు, ఒక కంప్యూటర్ను అందించారు. ఇవే కాకుండా శ్రీగురుదత్త సంస్థ వారు కూడా పుస్తకాలను విరాళంగా అందించారు. ఐదుగురు ఉపాధ్యాయులు విజయవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తున్నారు. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని, ఫీజుల బాధ తప్పిందని తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మా పాఠశాలలో 2017-18లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాం. అంతకు ముందు పాఠశాలలో 220 మంది విద్యార్థులుంటే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన తరువాత వారి సంఖ్య 358కి పెరిగింది. ఆంగ్ల మాధ్యమం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే విజయవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తాం.
మా ఊరి సర్కారు బడిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే పాఠశాలలో నా కూతురు 4వ తరగతి చదువుతున్నది. ఫీజుల బాధ లేకుండా బడిలో చదివించడం ఆనందంగా ఉంది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి.