పరిగి, జూలై 9 : లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లనుపైకి ఎత్తే కొత్త టెక్నిక్ వచ్చింది. ఇప్పటికే నగరాల్లో ఇలాంటి పనులు కొనసాగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మొదటిసారిగా పరిగి మండలం సుల్తాన్పూర్లోని ఉపాధ్యాయుడు శ్యాంసుందరాచారికి చెందిన ఇంటిని పైకి ఎత్తే పనులు జరుగుతున్నాయి. ఇటీవల బీటీ రోడ్డు వేయడంతో రోడ్డు కంటే ఇల్లు కిందికైంది. దీంతో గూగుల్లో సెర్చ్ చేయడంతోపాటు తన స్నేహితుడి సాయంతో హైదరాబాద్ నగరంలో పైకి ఎత్తిన ఇండ్లను స్వయంగా పరిశీలించారు.
విశ్వకర్మ హౌస్ లిఫ్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారితో తన ఇల్లును నాలుగు అడుగుల ఎత్తుకు లిఫ్ట్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. జూలై 2న పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం 74 జాకీలతో ఇంటిని పైకి ఎత్తే పనులు సాగుతున్నాయి. ఈనెల 20వ తేదీ లోగా పనులు పూర్తి చేసేలా నిర్ణయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి శనివారం ఇంటిని సందర్శించి సంస్థ ప్రతినిధులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.