ప్రజల సౌకర్యార్థం ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో ఎలాంటి వసతులు లేని ఖాళీ స్థలాలు, ఫుట్పాత్లు, మురుగు కాల్వలపై కూరగాయలు, మటన్, చికెన్, చేపలను విక్రయిస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి అత్యాధునిక వసతులతో సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మార్కెట్ నిర్మాణానికి రూ.కోటికిపైగా నిధులను కేటాయించింది. రెండు, మూడు నెలల్లో మార్కెట్లు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో చేపట్టిన మార్కెట్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో మూడు మున్సిపాలిటీల్లోనూ స్థలాల గుర్తింపుతో పాటు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో రూ.1.10 కోట్లతో మోడల్గా ఇబ్రహీంపట్నం మార్కెట్ రూపుదిద్దుకుంటుండగా, నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.
రంగారెడ్డి, జూన్ 29, (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోని ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలన్ని కల్పించేందుకుగాను ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలను వేగవంతం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రెండు, మూడు నెలల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను చర్యలు చేపట్టారు.
ఒక్కో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికిగాను సుమారు రూ.కోటి నిధులను ఖర్చు చేసి నిర్మిస్తున్నారు. జిల్లాలో 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లున్నాయి. ఇప్పటివరకు 13 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలు ప్రారంభమై, వివిధ దశల్లో పనులు వేగంగా జరుగుతుండగా, మరో మూడు మున్సిపాలిటీల్లో స్థలాల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, త్వరలో పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో మోడల్ మార్కెట్గా ఇబ్రహీంపట్నంలో రూ.1.10 కోట్లతో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. పనులు ప్రారంభమైన మున్సిపాలిటీలకు సంబంధించి తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 90శాతం పనులు పూర్తికాగా, మణికొండ మున్సిపాలిటీల్లో 70, నార్సింగి మున్సిపాలిటీలో 40, షాద్నగర్ మున్సిపాలిటీలో 60, శంషాబాద్ మున్సిపాలిటీలో 50, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో 35, ఆమనగల్లు మున్సిపాలిటీలో 25, ఆదిబట్లలో 50 శాతం, తుక్కుగూడ, మీర్పేట, బడంగ్పేట మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభమయ్యాయి.
ప్రతి పట్టణంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పట్టణ ప్రగతిలో భాగంగా హరితహారం, వైకుంఠధామాలు తదితర కార్యక్రమాలను అమలుచేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ప్రజలకు మరిన్ని వసతులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. పట్టణాల్లో ఎలాంటి వసతులు లేని ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ప్రస్తుతం కూరగాయలను విక్రయిస్తుండగా, ఫుట్పాత్లపై, మురుగు కాలువలపై మటన్, చికెన్, చేపలను విక్రయిస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి అన్ని వసతులు కలిగిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని మోడల్ మార్కెట్గా తీసుకొని రూ.1.10కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అత్యాధునిక వసతులతో ఉండే విధంగా నిర్మిస్తున్నారు.
సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లలో పండ్లు, పూలు, మటన్, చికెన్ చేపలను విక్రయించేందుకుగాను ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. కూరగాయలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో సూపర్ మార్కెట్ను పెట్టేందుకు ప్రతిపాదించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో విక్రయించే కూరగాయలతోపాటు తదితరాలు తాజాగా ఉండేందుకుగాను కోల్డ్ స్టోరేజీని సైతం నిర్మించనున్నారు. మార్కెట్లోకి వచ్చే ప్రజలకు తాగునీటి వసతికిగాను ఆర్వో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. అదేవిధంగా మార్కెట్లో ఎప్పటికప్పుడు కూరగాయల ధరల వివరాలను తెలుసుకునేందుకు చిన్నపాటి ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. కూరగాయలను కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి కూరగాయల ధరలు తెలిసే విధంగా మార్కెట్లోని వచ్చే ద్వారం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పూర్తిగా నిఘా నీడలోకి తీసుకువచ్చేందుకుగాను సమీకృత మార్కెట్ అంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి సంబంధించి స్థలాల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, పనులు ప్రారంభమయ్యాయి. మోడల్ మార్కెట్గా ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. పనులు ప్రారంభంకాని మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వీలైనంత త్వరలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అందుబాటులోకి తీసుకువస్తాం.
– ప్రతీక్జైన్, అదనపు కలెక్టర్