రంగారెడ్డి, జూన్ 29, (నమస్తే తెలంగాణ) : వానకాలానికి సంబంధించి రైతు బంధు సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. నేడు రెండెకరాల భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేసిన ప్రభుత్వం.. గురువారం మూడెకరాలు గల రైతులకు ఇవ్వనున్నారు. రెండు రోజుల్లో 1,80,840 మంది రైతుల ఖాతాల్లో రూ.85.96కోట్ల సాయాన్ని జమ చేశారు.
మొదటి రోజు ఎకరా భూమిగల 1,08,207 మంది రైతులకు రూ.30.79కోట్లు, రెండో రోజు రెండెకరాలుగల 72,633 మంది రైతులకు రూ.55.17 కోట్ల పెట్టబడి సాయాన్ని జమ చేశారు. పెట్టుబడి సాయమందిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారు. జిల్లాలోని ఆమనగల్లు తదితర మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జిల్లాలో వానకాలానికి సంబంధించి 3,68,559 మంది రైతులను రైతు బంధుకు అర్హులుగా గుర్తించారు. యాసంగితో పోలిస్తే కొత్తగా 31,935 మంది రైతులు రైతు బంధుకు అర్హులుగా గుర్తించారు.