పరిగి, మార్చి 2 : అభివృద్దికి ప్రభుత్వం ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నా, వాటికి మరింత తోడుగా నిలిచేలా మున్సిపాలిటీల్లో పన్నులను వంద శాతం వసూలు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మున్సిపాలిటీలు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ఉన్నాయి. వాటిలో రెండు పరిగి, కొడంగల్ కొత్త మున్సిపాలిటీలు కాగా రెండు పాతవి కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం వలె ఈసారి కూడా వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నెలాఖరు లోపు పన్నులు వసూలు చేయాలని ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు. పన్నుల వసూలుతో మున్సిపాలిటీల పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేయించడానికి అవకాశం కలుగుతుంది. పట్టణాలు విస్తరిస్తుండడంతో ఎంత అభివృద్ధి చేసినా కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. వాటిలోనూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరాకు అవసరమైన పైప్లైన్ నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తున్నది. కొత్త మున్సిపాలిటీలకు సంబంధించి గతంలో పెద్దగా నిధులు ఉండేవి కాదు. దీంతో అనేక కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు మున్సిపాలిటీగా ఏర్పాటైనన తర్వాత చేపట్టాల్సి వస్తున్నది.
వికారాబాద్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో పన్నుల వసూలుపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నెలాఖరు లోపు వంద శాతం పన్నులు వసూలు చేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించడంతో మున్సిపాలిటీల పరిధిలో ఏఏ పన్నుల బకాయిలు ఉన్నాయి లెక్కలు తీసి వాటిని వసూలు చేస్తున్నారు. జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీ తాండూరులో సుమారు రూ.7కోట్లు పన్నుల బకాయిలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.2.5కోట్లు వసూలు చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీలో ఈ సంవత్సరం, గత బకాయిలు కలిపి మొత్తం రూ.3.20కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1.94కోట్లు వసూలు చేశారు. పరిగి మున్సిపాలిటీలో 1,34,57,000 వసూలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 73,85,000 వసూలు చేశారు. కొడంగల్ మున్సిపాలిటీలో ఈసారి రూ.91లక్షలు పన్నులు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.46లక్షలు వసూలు చేశారు.
ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో.. మార్చి నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో పన్నుల వసూలే లక్ష్యంగా మున్సిపాలిటీల అధికారులు పనిచేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులకు వార్డులు కేటాయించి, ఆయా వార్డుల్లోని ఇంటి పన్నులు, ఇతర పన్నుల వసూలు నిర్దేశించారు. వార్డు పరిధిలో ఎన్ని కుటుంబాలు, ఎన్ని వాణిజ్య దుకాణాలున్నాయి. వాటికి సంబంధించి ఒక్కో ఇంటివారీగా పన్నుల బకాయిలు ఎంత ఉన్నాయనే జాబితాను తయారు చేసి ఉద్యోగులకు ఇచ్చారు. ఈ జాబితా ఆధారంగా మున్సిపల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పాత బకాయిలు, ఈ సంవత్సరం పన్నులు సైతం వసూలు చేస్తున్నారు. వాణిజ్య సంస్థల్లో పెద్దమొత్తంలో బకాయిలుంటే స్వయంగా మున్సిపల్ కమిషనర్లు పన్నుల వసూలుకు ఆయా సంస్థలవారితో మాట్లాడి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలావుండగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పరిగి, కొడంగల్ రెండు కొత్తవి కావడంతో గతంలో ఉన్న పన్నుల వ్యవస్థనే కొనసాగుతున్నది. ఇప్పటివరకు పన్నులు పెంచలేదు. ఈ మున్సిపాలిటీలు ఏర్పడి మూడేండ్లు అయింది. మూడేండ్ల వరకు పాత పన్నులే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్ల పాత పన్నులన్నీ సకాలంలో చెల్లిస్తే వాటికి అదనంగా పెనాల్టీ పడదని, అందువల్ల వెంటనే చెల్లించాల్సిందిగా మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రెగ్యులర్గా పన్నులు చెల్లించేవారికి ప్రభుత్వం రిబేటు సదుపాయం కల్పించింది. సంబంధిత ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్నులు ఏప్రిల్ నెలలో చెల్లిస్తే 5శాతం రిబేటు సదుపాయం కల్పించింది. ఈ అవకాశం వినియోగించుకుంటే పన్నుల భారం చాలావరకు తగ్గుతుందని, రెగ్యులర్గా చెల్లింపులతో ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసే లక్ష్యంతో అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు.
– మోతీలాల్, వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్
జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఈ నెలాఖరు వరకు వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా నిర్దేశించాం. మున్సిపాలిటీల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటుచేసి ఆయా వార్డులవారీగా పన్నుల వసూలు కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం పన్నుల వసూలు బాగున్నది. ఈసారి సైతం పూర్తిస్థాయిలో పన్నుల వసూలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం.