హనుమకొండ, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘వర్షాభావంతో ప్రాజెక్టులకు జలకళ లేదు. రానున్న రోజుల్లో తాగునీరు, సాగునీరే కాకుండా కరెంటు సరఫరా కూడా కష్టమవుతుంది. మొత్తం థర్మల్ విద్యుత్తుపైనే ఆధారపడితే బొగ్గు సమకూర్చుకోవడం కూడా కష్టమే. కాబట్టి, నీళ్లతోపాటు కరెంటును పొదుపుగా వాడుకోవాలి.’ – జూలై 20న హైదరాబాద్లో జరిగిన ఓ సదస్సులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రాష్ట్రంలో పవర్ కట్ లేనేలేదు. వర్షాలు, ఈదురుగాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే తాత్కాలికంగా అంతరాయం కలుగుతున్నది. వీటిని ప్రజలు పవర్ కట్గా భావించవద్దు.’
-జూలై 22న వరంగల్లో జరిగిన టీజీఎన్పీడీసీఎల్ సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
వానలు లేక ప్రాజెక్టుల్లోకి నీళ్లు రావడంలేదని, నీళ్లు, కరెంటు పొదుపుగా వాడుకోవాలని ఒకవైపు చెప్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మరోవైపు, వానలు రావడం వల్లే కరెంటు కోతలు ఉంటున్నాయని అంటున్నారు. కరెంటు సరఫరా, నిర్వహణపై పూర్తిగా విరుద్ధమైన ప్రకటలు చేస్తుండటం గమనార్హం. సాగునీరు ఇవ్వకపోవడం, కరెంటు నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పుడు నీరు, కరెంటు పొదుపుపై ఉచిత సలహాలు ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా, ముందస్తు జాగ్రత్తలు, నీటి నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పంటలకు సాగునీటి సరఫరాలో ఘోరంగా విఫలమైంది.
సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ ప్రణాళిక లేమితో గోదావరిలో నీళ్లు ఉన్నా పంటలకు అందడం లేదు. కరువు పరిస్థితుల్లో బోర్ల కింద పంటలు సాగు చేసుకొనే రైతులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం… ఇంధన శాఖ నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీరుతో పూర్తిగా విఫలమైంది. కరెంటు సరఫరాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసే ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కరెంటు కోసం ప్రతిరోజూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అవేమీ కనిపించనట్టుగా ఉపముఖ్యమంత్రి తీరు ఉంటున్నది. కరువు పరిస్థితుల్లో కరెంటు డిమాండు, సరఫరా, ఉత్పత్తి విషయాలను పట్టించుకోవడంలేదు. ప్రకృతే అంతా సర్దుబాటు చేస్తుందనే ఉద్దేశంతో కరెంటు సరఫరా పరంగా కరువును ఎదుర్కొనేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు గరిష్ఠ డిమాండు అనే ప్రకటనలు చేసి చేతులు దులుపుకొంటున్నారు.
సాగునీరు ఇవ్వక…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషితో పదేండ్లు రాష్ట్రంలో ఎక్కడా కరువు పరిస్థితులు రాలేదు. కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టులతో రాష్ట్రవ్యాప్తంగా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందింది. తెలంగాణలో గరిష్ఠంగా బోర్ల కిందనే పంటల సాగు ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులు, కాలువలతో ప్రతి చెరువు, కుంటలకు నిరంతరంగా నీటి సరఫరా ఉండటంతో ప్రతి ప్రాంతంలోనూ బోర్లలో పంటలకు సరిపడా నీటి వనరులు ఉండేవి. పంటల సాగుకు రైతులు ఎక్కడా ఇబ్బందులు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో పంటల సాగు రైతులకు ఆందోళనకరంగా తయారైంది. నీటి వనరులు ఉన్నా ప్రణాళిక ప్రకారం సద్వినియోగం చేసుకొనే పరిస్థితి లేకపోవడంతో పంటలు ఏ సీజన్లో పండుతాయో, ఎప్పుడు ఎండుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ ప్రాణహిత నదిలో ప్రవాహంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేసే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్కు పేరు వస్తుందనే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీటిని సరఫరా చేయడంలేదు. దీంతో పంటల సాగు పూర్తిగా సంక్షోభంలో పడింది.
ఉత్పత్తిపై ఉత్తుత్తి ప్రణాళికలు
కరువు పరిస్థితులకు తగినట్టుగా కరెంటు ఉత్పత్తి, సరఫరాలో ఇందన శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సాగునీటి సరఫరాపై రైతుల్లో నమ్మకం లేకపోవడంతో బావులు, బోర్ల ఆధారంగానే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరెంటు డిమాండు 13,300 మెగావాట్ల నుంచి 14 వేల మెగావాట్ల వరకు ఉంటున్నది. సగటున 12,400 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతున్నది. డిమాండుకు తగినట్టు సరఫరా లేకపోవడంతో లోడ్ రిలీజ్ (ఎల్ఆర్) పేరిట కోతలు పెడుతున్నారు. కరెంటు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రతిరోజూ నిరసనలకు దిగుతున్నారు. కరెంటు సరఫరా చేయాలని సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. వానకాలం పంటల సాగు మొదలయ్యే సమయంలోనే డిమాండుకు సరిపడా కరెంటు ఉత్పత్తి చేయకపోవడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వానలు లేకపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పోచంపాడులోని జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి నామమాత్రంగానే ఉన్నది. కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, మిర్యాలగూడలోని విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు సరఫరా లేక తక్కువగా ఉత్పత్తి జరుగుతున్నది. కరువు పరిస్థితుల నేపథ్యంలో అసరమైన మేరకు కరెంటు ఉత్పత్తి కోసం బొగ్గును నిల్వ చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆరు నెలల ముందు నుంచి ఉన్న కరువు హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే బొగ్గుతో అయినా సరిపడా కరెంటు ఉత్పత్తి చేసుకొనే అవకాశం ఉండేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని విద్యుత్తురంగ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
కొనే ప్రణాళిక లేదు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే వ్యవసాయ రంగానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పదేండ్లపాటు ప్రతి సీజన్లోనూ పంటలకు పుష్కలంగా నీటిని సరఫరా చేసింది. బావులు, బోర్లకు నిరంతరం నాణ్యమైన కరెంటు ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో అవసరమైన కరెంటు లేకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి సాగుకు ఉచితంగా సరఫరా చేసింది. పంటల సాగుకు ఎప్పుడూ ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. పంటల సాగులో అతి ముఖ్యమైన సాగునీరు, కరెంటు సరఫరాలో అంశాలను పట్టించుకోవడంలేదు. కరువు పరిస్థితుల్లో జల విద్యుత్తు ఉండదు. బొగ్గు నిల్వలు లేకపోవడంతో ధర్మల్ విద్యుత్తు తక్కువగానే ఉంటున్నది. ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి కరెంటు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించుకున్నా కరెంటు దొరికే పరిస్థితి లేదని నిఫుణులు చెప్తున్నారు. వాతావరణ, వ్యవసాయ సీజన్ల తేడా కారణంగా ఉత్తరాది రాష్ర్టాల్లో కరెంటు డిమాండు తక్కువగా ఉన్నప్పుడు తెలంగాణకు ఎక్కువ అవసరం ఉండేది. మన రాష్ట్రంలో వరి కోతల సమయంలో ఉత్తరాది రాష్ర్టాల్లో డిమాండు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులకు తగినట్టుగా తెలంగాణకు అవసరమైన కరెంటును కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కరువు పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నది. అన్ని రాష్ర్టాల్లోనూ కరెంటు సరఫరాలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి మనకు కరెంటు వచ్చే పరిస్థితి కనిపించడంలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో కొనాలంటే అత్యధిక ధర చెల్లించాల్సి రావచ్చని విద్యుత్తురంగ నిఫుణులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక, పర్యవేక్షణ లోపం కారణంగా పంటల సాగు కోసం రైతులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది.
నారుమడులకు కరెంటు లేదు
ఎల్ నినో కరువు పరిస్థితులు ఉంటాయని వాతావరణ పరిశోధనా సంస్థలు ఆరు నెలల నుంచే హెచ్చరిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఇంధన శాఖ కరువును ఎదుర్కొనేందుకు అవసమైన కనీస ఏర్పాట్లు చేయలేదు. ప్రస్తుతం నారుమడులకు నీటి సరఫరా చేసేందుకే అరకొర కరెంటు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే నాట్లు వేసిన తర్వాత డిమాండుకు తగినట్టుగా ప్రభుత్వం కరెంటు సరఫరా చే స్తుందా? అని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టులు, కాలువలతో నీ ళ్లు వస్తాయనే ఆశలు వదలుకొని, ఉమ్మడి రాష్ట్రంలో తరహాలో పూర్తిగా బావులు, బోర్లను నమ్ముకొని వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. పంటల విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించుకుంటున్నారు. రాష్ట్రం లో దాదాపు 30 లక్షల వ్యవసాయ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ప్రాజెక్టులు, కాలువల ద్వారా చెరువులకు నీటి సరఫరా లేకపోవడంతో బావులు, బోర్లలో నీటి లభ్యత అడుగంటుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి నాణ్యమైన, మెరుగైన కరెంటు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం కోతలతో రైతులను ఇ బ్బందులు పెడుతున్నది. నీటి మట్టాలు లోపలికి వెళ్తుండటంతో సాధారణం కంటే కరెంటు ఎక్కువ అవసరమవుతున్నది. ప్రభుత్వం మాత్రం అవసరానికి భిన్నం గా తక్కువగా సరఫరా చేస్తున్నది. దీంతో నారు మడులను రక్షించుకోవడానికే రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.