వికారాబాద్, మార్చి 2 : ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. బుధవారం వికారాబాద్ మండలం ఎర్రవల్లిలో కేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డీఆర్డీఏ, ఉపాధి హామీ, ప్రభుత్వం ద్వారా అందే పథకాలను తెలుసుకొని, ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదుగాలన్నారు. ఎర్రవల్లి గ్రామానికి కృష్ణ ప్రసాద్ ఫౌండేషన్ తరపున విద్య, అభివృద్ధి జరుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు 36 సైకిళ్లు అందజేసి విద్యార్థుల విద్యకు చేయూతనందించారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ఫౌండేషన్ ద్వారా అందే సహాయాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. స్వతహాగా ఎదిగిన 104 మంది మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా కేపీ ఫౌండేషన్ చైర్మన్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎర్రవల్లి గ్రామ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాభివృద్ధికి కూడా తమ వంతు బాధ్యత తీసుకుంటామన్నారు. పాఠశాలకు 100 బెంచీలు, బ్యాగులు, పుస్తకాలు తదితర వాటిని అందజేశామన్నారు. కేపీ ఫౌండేషన్ రాష్ట్రంలోని అసిఫాబాద్, ములుగు, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో కొనసాగుతున్నదన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లో కూడా విస్తరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్, పీడీ డీఆర్డీఏ నర్సింహులు, డీఆర్డీవో కృష్ణన్, ఎంపీడీవో సత్తయ్య, సీఐ రాజశేఖర్, సర్పంచ్ పాల్గొన్నారు.