Jana Nayagan | తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) ఎట్టకేలకు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రిలీజ్కి ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మూవీ విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రాకపోయినా, ఇప్పుడు సినిమా ఓటీటీ హక్కుల వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దళపతి వెట్రి కొండన్ పాత్రలో కనిపించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు.
సినిమాలో విజయ్ మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, కథనం నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉండటంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం IMDbలో 10కి 6.1 రేటింగ్ నమోదు చేసుకుంది. సినిమా విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు రూ.110 కోట్లకు సొంతం చేసుకునే దిశగా చర్చలు జరిపినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే విడుదల ఆలస్యం, ఇతర కారణాలతో ఆ ఒప్పందం చివరికి కుదరలేదని సమాచారం. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ సినిమా హక్కులను సుమారు రూ.50 కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో దాదాపు రూ.60 కోట్ల తేడాతో ఓటీటీ భాగస్వామి మారిపోయిందనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు 21 నుంచి ‘జన నాయగన్’ జీ5లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. విజయ్ సినీ జీవితానికి ముగింపు పలికిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని అభిమానులు భావిస్తుండగా, ఓటీటీ విడుదల కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే డిజిటల్ రిలీజ్, హక్కుల వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.