సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ /ఇబ్రహీంపట్నం, మార్చి 1 : హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో శివరాత్రి పండుగ రోజున ఉదయం సమయంలో కాల్పుల సంఘటన తీవ్ర కలకలం రేపింది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తులను చూసిన స్థానికులు పోలీసులు, 108కిఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరు సంఘటన స్థలంలోనే మృతిచెందగా.. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కాల్పుల సంఘటనతో ఉలిక్కిపడ్డ రాచకొండ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. పోలీసు కమిషనర్ మహేశ్భగవత్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉండి కేసు దర్యాప్తును పరిశీలించారు. ఉన్నతాధికారులందరూ ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు వివిధ కోణాల్లో సిబ్బందిని పంపిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు. ఉదయం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సాయంత్రానికి మాత్రం ‘భూ’ వివాదాలే కారణమని ప్రాథమికంగా తేల్చారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి రాచకొండ పోలీసులు మొదటగా మట్టారెడ్డి, శ్రీనివాస్రెడ్డి అనుచరుడు హఫీజ్, డ్రైవర్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి ఈ ఏడాది జనవరి నెలలో కర్ణంగూడకు చెందిన ఇంద్రారెడ్డి, నరసింహరెడ్డి, పురుషోత్తంరెడ్డిల నుంచి 8 ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా అభివృద్ధి చేసి వారికి అప్పగించే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీంట్లో భాగంగానే మూడు నెలల నుంచి శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి ప్రతి రోజూ ఉదయం వచ్చి వారు ఒప్పందం కుదుర్చుకున్న భూములను చూసుకుని వెళ్తుండేవారు. మంగళవారం రోజు కూడా ఇదే తీరులో వచ్చిన శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి హత్యకు గురయ్యారు. అయితే రోజూ శ్రీనివాస్రెడ్డి వెంట ఉండే అనుచరుడు హఫీజ్, డ్రైవర్ కృష్ణ రాకపోవడంతో అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం జగ్నే కీ రాత్ ఉండడంతో హఫీజ్ రాలేకపోయానని వివరించగా.. కృష్ణ శ్రీనివాస్రెడ్డి వద్దనడంతో రాలేదని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి చేస్తున్న డెవలప్మెంట్ స్థలం పక్కనే మట్టారెడ్డికి ఓ ఎకరం స్థలం ఉంది. అయితే పలు సందర్భాల్లో మట్టారెడ్డి.. శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డిల మధ్య విభేదాలు తలెత్తేవని స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారంతో తెలిసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మట్టారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా.. వీరితో టచ్లో ఉన్న రౌడీలు, రియల్ దందా చేసేవారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ హత్యకు ఇంకా ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంలో కూడా పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మొత్తం 5 బృందాలతోపాటు దాదాపు 50 మంది సిబ్బంది మిస్టరీ ఛేదనకు కృషిచేస్తున్నారు. క్లూస్, డాగ్ స్కాడ్ బృందాలు కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి.
శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డిపై కాల్పులు జరిపిన దుండగులు ఓ గ్యాంగ్గా వచ్చి ఉంటారని తెలుస్తున్నది. దుండగుల్లో ఒకరు కారు నడిపిస్తున్న రాఘవేంద్రరెడ్డిపై కాల్పులు జరుపగా, మరొకరు కారు దిగి పారిపోతున్న శ్రీనివాస్రెడ్డిని వెంబడించి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపినట్లు తేలింది. సంఘటనలో లభించిన బుల్లెట్తో పాటు మృతుల శరీరంలో లభించిన బుల్లెట్లను పరిశీలించిన అధికారులు, వైద్యులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా దేశవాళీ తుపాకీలా, లేదా షార్ట్ వెపన్లా తేల్చుకునేందుకు పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
అల్మాస్గూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి ఉదయం ఇంటి నుంచి బయలుదేరి అరగంటలో వారు చేస్తున్న ఓ డెవలప్మెంట్ వెంచర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ కొద్ది సేపు ఉండి.. వారు తిరిగి 8 గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న మట్టారెడ్డితో మాట్లాడారు. 8.30 గంటల ప్రాంతంలో వీరు అక్కడి నుంచి బయలుదేరి ముందుకు సాగారు. ఇంతలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముందుగా స్కార్పియో కారు నడిపిస్తున్న రాఘవేంద్రరెడ్డిపై కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ ఛాతిలోకి దిగడంతో రాఘవేంద్రరెడ్డి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన శ్రీనివాస్రెడ్డి కారు దిగి పొదల్లోకి పారిపోతుండగా అతడిని పాయింట్ బ్లాంక్ దగ్గర నుంచి అతడి కంటిలో కాల్చి చంపారని సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
కర్ణంగూడ గ్రామం సర్వే నం.లో 369, 371, 372లో ఇంద్రారెడ్డి, నరసింహారెడ్డి, పురుషోత్తంరెడ్డిలకు 18 ఎకరాల భూమి ఉంది. ఈ స్థలాన్ని 20 ఏండ్ల కిందట లేక్ విల్లా రిసార్ట్స్ యాజమాన్యానికి అమ్మేశారు. లేక్ విల్లా రిసార్ట్స్ నిర్వాహకులు ఆ 18 ఎకరాలను వెయ్యి గజాల ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. అయితే తాజాగా ఈ ముగ్గురి పేరుపై రెవెన్యూ రికార్డుల్లోకి రావడంతో వారు 8 ఎకరాల స్థలాన్ని తిరిగి వ్యవసాయ భూమి కింద మార్చుకుని వారికి ఇవ్వాలనే ఒప్పందంతో శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డిలతో ఒప్పందం కుదుర్చున్నారు. మట్టారెడ్డి ప్లాట్ యజమానులతో కొన్నింటిని కొనుగొలు చేసి వాటి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. అయితే మరికొన్నింటికి సంబంధించిన వ్యవహారంలో వీరికి విభేదాలు తలెత్తాయని గ్రామస్తులు వివరిస్తున్నారు. దీనిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇటు స్థానిక గ్రామస్తులతో పాటు రెవెన్యూ అధికారులను ఆరా తీస్తున్నారు.
కాల్పుల సంఘటనలో మరణించిన శ్రీనివాస్రెడ్డిపై, అతడి బంధువుపై దాడి చేసిన కేసులతోపాటు మరికొన్ని సెటిల్మెంట్కు సంబంధించిన ఆరోపణలున్నాయి. రాఘవేంద్రరెడ్డిపై జంట హత్యల కేసు ఉండగా.. అందులో జీవిత శిక్ష పడి కొన్నేండ్ల తర్వాత జైలు నుంచి విడుదలైనట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. రెండేండ్ల కిందటనే రాఘవేంద్రరెడ్డికి ఓ మహిళా న్యాయవాదితో వివాహం జరిగిందని తెలిసింది. ఇటీవల వీరు చాలా ల్యాండ్ పంచాయితీలతోపాటు జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పోలీసుల విచారణలో తెలిసింది.