మెరుగైన వైద్యమే లక్ష్యంగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 264 పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 పీపీ యూనిట్లు, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు వైద్య సేవలందిస్తున్నాయి. కొత్తగా మరో 9 పట్టణ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే అన్ని రకాల పరిశ్రమలతో ఇండస్ట్రియల్ హబ్గా పేరొందిన జిల్లా.. అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నది. పరిశ్రమల నిర్వహణకు జిల్లా అనుకూలంగా ఉండడంతో కార్పొరేట్ కంపెనీలు తమ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు వేల కంపెనీలు కొలువుదీరగా.. లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది. ఇంకా ఫార్మాసిటీ, ఐటీ పార్కులు వెలుస్తున్నాయి. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలనే మార్చేసింది. డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, వర్మీ కంపోస్టు షెడ్డు, సీసీ, బీటీరోడ్లు తదితర మౌలిక వసతులు, పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలు, పట్టణాలు మెరుస్తున్నాయి. అదేవిధంగా మిషన్ భగీరథ పథకం జిల్లా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగా, మిషన్ కాకతీయ రైతుకు సరిపడా సాగునీరందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మొదటి విడుతగా జిల్లాలో రూ.97.88కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లా ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది.
రంగారెడ్డి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో హైదరాబాద్ మహా నగరానికి చేరువలో ఉన్న జిల్లా పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్తోపాటు పలు రంగాల్లోనూ ముందున్నది. సకల జనుల హితమే పరమావధిగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కారు ప్రతి పల్లెనూ ప్రగతి పథంలో నడిపిస్తున్నది. కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ఫలాలను అందిస్తున్నది. ‘రైతుబంధు’, సాగుకు 24 గంటల ఉచిత కరెంట్తో అన్నదాతకు ధీమానిచ్చింది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలకు కొత్తందాలు రాగా.. పల్లె, బస్తీ దవాఖానలతో ప్రజలకు వైద్యం చేరువైనది. ప్రతి ఒక్కరికీ కేసీఆర్ కిట్ అందుతున్నది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న గ్రామీణ, పట్టణ రహదారులకు మహర్దశ పట్టింది. ఇంకా విద్య, శాంతి భద్రతలతోపాటు అన్ని రంగాలకూ సమప్రాధాన్యతనిస్తూ, సబ్బండవర్ణాలకు ధైర్యం కల్పిస్తున్నది. ఇండస్ట్రియల్ పార్కులు, ఫార్మాహబ్లు, ఇతర సంస్థ లు, కంపెనీల ఏర్పాటుతో జిల్లాలో పారిశ్రామిక రం గం జోరందుకున్నది. ఈ పరిశ్రమలతో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలను ఎంతో మార్చింది. అన్ని గ్రామాల్లో రైతువేదికలు, వననర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారు. హరిత హారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. ప్రభుత్వం జిల్లా సమగ్రాభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నది.
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిశ్రమల కేంద్రం ఎంతో కృషి చేస్తున్నది. రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా పరిశ్రమల స్థాపనలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. టీఎస్ఐపాస్ యాక్ట్-2014 ప్రకారం, 2023 ఫిబ్రవరి వరకు 1,615 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివిధ శాఖల నుం చి పరిశ్రమల స్థాపనకు 4093 అనుమతులొచ్చాయి. జిల్లాలో (ఏ) టీఎస్ ఐ పాస్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా – తయారీ, మెగా-మౌలిక తరహా పరిశ్రమలకు సంబంధించి రూ.77,332.57 కోట్ల పెట్టుబడితో 1,615 యూనిట్ల్లను నెలకొల్పారు. వీటి ద్వారా 9,69,699 మందికి ఉపాధి దొరికింది. (బీ) టీఎస్ ఐపాస్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా-తయారీ, మెగా-మౌలిక తరహా పరిశ్రమలకు సంబంధించి రూ.45,573.40 కోట్లతో 1,211 యూనిట్ల్లను పారిశ్రామిక వేత్త లు ఏర్పాటు చేసి 5,12,486 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొంగరకలాన్లో ఇండస్ట్రియల్ పార్కు, ఫార్మాసిటీ, ఎలిమినేడు, చందనవెల్లిలాంటిప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పడుతున్నాయి.
సామాజిక భద్రతలో భాగంగా పేదలందరికీ సురక్షితమైన జీవనాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముం దుకెళ్తున్నది. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. పట్టణ, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలకు ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రత్యేక నిధులను వెచ్చిస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నది.
ప్రభుత్వ బడుల బాగు కోసం సీఎం కేసీఆర్ మన ఊరు -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం క్రింద జిల్లాలో మొదటి విడుతలో 464 పాఠశాలలను ఎంపిక చేయగా.. అందులో 448 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.97 కోట్ల 88 లక్షలను కేటాయించింది. ఇందులో రూ.30 లక్షలకు లోబడి ఉన్న 345 పాఠశాలలు ఇంజినీరింగ్ విభాగం ద్వారా ప్రారంభించారు. ప్రతి మండలానికీ రెండు చొప్పున 54 పాఠశాలలను తీర్చిదిద్దగా అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 9 పాఠశాలలను ప్రారంభించారు. ఇంకా 45 సిద్ధంగా ఉన్నాయి.
జిల్లాలో మొత్తం 792 చెరువులుండగా.. దాదాపుగా అన్ని చెరువులు మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా పునరుద్ధరణకు నోచుకున్నాయి. చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వడంతో 60 చెరువులు 100 ఎకరాలకు పైగా నీరందించేలా..732 చెరువులు 100ఎకరాలకు దిగువన నీరందించేలా తీర్చిదిద్దడం జరిగింది. ఇవి మొత్తంగా 31,936.28 ఎక రా లకు నీరందించేలా పునరుద్ధరించడం జరిగింది. గత పాలకులు దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కింది.
రంగారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.47,635.49 లక్షల నిధులను వెచ్చించినది. దీని ద్వారా జిల్లాలోని 580 గ్రామాల్లోని ప్రజలకు సురక్షిత తాగునీరు ఇంటింటికీ అందుతున్నది.