రంగారెడ్డి, జనవరి 6, (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు సంబురంలా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నాటికి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.50వేల కోట్లకుపైగా రైతుబంధు సాయం జమ కానున్న నేపథ్యంలో సంబురాలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంబంధిత పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బహుమతులను అందజేశారు. గురువారం జిల్లాలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బహుమతులను అందజేశారు. షాద్నగర్ నియోజకవర్గంలోని చౌదరిగూడెం మండల కేంద్రం, నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుసంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రతి గ్రామంలో ఇంటింటికీ రంగులు, పూలు, ధాన్యం, పండ్లతో ముగ్గులు వేసి ప్రదర్శించనున్నారు. శనివారం ఉత్తమ రైతులకు సన్మానాలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ రైతులతో సమీక్షలు, ఆదివారం వ్యవసాయ మార్కెట్యార్డులు, సహకారసంఘాల్లో రైతుబంధు గురించి అలంకరణ కార్యక్రమాలు, ముగింపు రోజైన సోమవారం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలస్థాయిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఎడ్లబండ్లతో ర్యాలీలు..
వికారాబాద్ జిల్లా పరిధిలోని పలుచోట్ల రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, పలు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని బొంరాస్పేట్ మండలం బురాన్పూర్, ఎన్నెమీదితండా, కొత్తూరు, ఎన్కెపల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాల్లో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో ఎడ్లబండ్లతో ర్యాలీ జరిపారు. రైతులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాలు పంచుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి నాయకులు సంబురాలు నిర్వహించారు. రైతుల ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా వ్యవసాయాధికారులు పాల్గొని ఆయా గ్రామాలకు 8 విడుతలుగా రైతుబంధు కింద అందజేసిన పెట్టుబడి సాయం వివరాలు తెలియజేశారు.