సర్కారు దవాఖానలకు మంచిరోజులొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సకల సౌకర్యాలు సమకూరాయి. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుకునే మాటలకు చెల్లుచీటి పడి, ఆరోగ్య ప్రదాయినులుగా మారాయి. ఈ తొమ్మిదేండ్లలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. వికారాబాద్ జిల్లాలో 4 బస్తీ, 112 పల్లె దవాఖానలు, రంగారెడ్డి జిల్లాలో 58 బస్తీ, 82 పల్లె దవాఖానలను ఏర్పాటు చేయగా, సామాన్యుడికి సైతం నాణ్యమైన వైద్యం అందుతున్నది. వికారాబాద్ ఏరియా ఆసుపత్రి, తాండూరులోని జిల్లా ఆసుపత్రి, పరిగి, కొడంగల్ ప్రభుత్వాసుపత్రుల్లో ఏడాదిన్నరగా 1,18,498 మందికి డయాలసిస్ సేవలు అందాయి. రంగారెడ్డి జిల్లాలోని 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 27 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలందుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 37,176 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేయగా, రంగారెడ్డి జిల్లాలో 2,18,310 మందికి కేసీఆర్ కిట్లను అందజేశారు.
బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మందులు అందుతున్నాయి. ఆరోగ్య మహిళా పథకంతో క్యాన్సర్ నిర్ధారణ, ఇతర వైద్య పరీక్షలతోపాటు 8 రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో మొదటి విడుత 3.48 లక్షల మందికి, రెండో విడుతలో 4,83,582 మందికి కంటి పరీక్షలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 8.50 లక్షల మందికి, రెండో విడుతలో 7,54,756 మందికి కంటి పరీక్షలు చేశారు. వికారాబాద్ జిల్లాకు 100 సీట్లతో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయగా, ఫర్నిచర్ కొనుగోలుకు రూ.235 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అనుబంధంగా బోధనాసుపత్రి కోసం రూ.30 కోట్లతో 380 పడకలతో ఏరియా దవాఖానపై మరో రెండస్తులను నిర్మిస్తున్నది. జిల్లాకు నర్సింగ్ కాలేజీ, ఆయుష్ కాలేజీ, సెంట్రల్ డ్రగ్ స్టోరేజీలను రాష్ట్ర సర్కార్ మంజూరు చేసింది.
– రంగారెడ్డి, జూన్ 13 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. సామాన్యులకు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నది. ఇప్పటికే పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి అవసరమైన వైద్యులను భర్తీ చేయడంతోపాటు సరిపడా మందులను పంపిణీ చేస్తున్నది. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దింది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో సర్కారు దవాఖానలను అప్పటి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో రోగులు సర్కారు దవాఖానలకు వెళ్లాలంటేనే జంకేవారు. కానీ .. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ దవాఖానలకు మహర్దశ వచ్చింది. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలతో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలు మెరుగుపడ్డాయి. సాధారణ జ్వరం మొదలు ప్రసవాలు, డయాలసిస్, డయాగ్నోస్టిక్ పరీక్షల వరకు సర్కారు ఆస్పత్రుల్లో నే ప్రజలు సేవలు పొందుతున్నారు. మాతా,శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. గర్భిణుల్లో రక్తహీనత నివారణకు న్యూట్రిషన్ కిట్లు, గ్రామాల్లోనూ మెరుగైన వైద్యమందేలా పల్లె, బస్తీ దవాఖనాలను ఏర్పా టు చేసింది. ప్రజల్లో కంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నది. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయగా..ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాకు నర్సింగ్, ఆయుష్ కాలేజీలు, సెంట్రల్ డ్రగ్ స్టోరేజీలనూ మంజూరు చేసింది.
జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ..
ప్రతి జిల్లాకూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకు 100 సీట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఇప్పటికే కాలేజీ నిర్మాణం, అప్గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ తదితర సామగ్రి కొనుగోలు నిమిత్తం రూ.235 కోట్లను విడుదల చేశా రు. అయితే మెడికల్ కాలేజీకి అనుబంధంగా 380 పడకలతో బోధన దవాఖానను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.30 కోట్లతో ఏరియా దవాఖానపై మరో రెండస్తుల భవనాన్ని నిర్మిస్తుండగా ఆ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మెడికల్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణం రెండేండ్లలో పూర్తి కానున్న నేపథ్యంలో అప్పటివరకు తాత్కాలిక భవనంలో ఈ విద్యాసంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖాన అందుబాటులోకొస్తే 26 రకాల నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందనున్నాయి. అదేవిధంగా జిల్లాలోని అనంతగిరి టీబీ దవాఖాన సమీపంలోని ఎకరా స్థలంలో ఔషధాల నిల్వ కేంద్రాన్ని (సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ) అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.మూడు కోట్లను మంజూరు చేసింది. జిల్లాలోని అన్ని సర్కారు దవాఖానలకు అవసరమైన మందులను ఇక్కడి నుంచే సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి జిల్లాలోని దవాఖానలకు మందులు సరఫరా అవుతున్నాయి.
ఆరోగ్య మహిళా పథకం..
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100 పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని క్రింద ప్రతి మహిళకూ ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించనున్నారు. వారానికి ఒకరోజు ప్రత్యేకంగా మహిళలకు వైద్య సేవలనందించనున్నారు. క్యాన్సర్ నిర్ధారణ, డయాగ్నోస్టిక్ పరీక్షలతోపాటు స్త్రీలకు సంబంధించి ప్రధానంగా 8 రకాల అనారోగ్య సమస్యలకు వైద్యసేవలను అందించనున్నారు. అయితే జిల్లాలోని రామయ్యగూడ, యాలాల, దోమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తొలుత ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. నేడు జిల్లాలోని సంబంధిత మూడు పీహెచ్సీల్లో ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మందులు..
బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్నది. జిల్లాలో బీపీ, షుగర్ బాధితులు 75,432 మంది ఉండగా.. వారందరికీ ప్రతి పీహెచ్సీ ద్వారా బీపీ, షుగర్ మందులను పంపిణీ చేస్తున్నది. అయితే ఎన్సీడీ కార్యక్రమ అమలు కోసం నియమించిన ఆశ వర్కర్లు ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటింటికెళ్లి సర్వే చేసి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి బాధితుల వివరాలను జిల్లా ప్రోగ్రామ్ అధికారికి అందజేస్తున్నారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా జిల్లాలోని ఆయా పీహెచ్సీలకు బీపీ, షుగర్ మందులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు. అయితే గత మూడేండ్లుగా బీపీ, షుగర్ బాధితుల కోసం పీహెచ్సీలకు ఉచితంగా మందులను సరఫరా చేస్తుండగా.. గతేడాది నుంచి ఇంటింటికెళ్లి ఆశ వర్కర్లు బాధితులకు బీపీ, షుగర్ మందులను నెలకు సరిపడా ఒకేసారి అందజేస్తున్నారు.
జిల్లాకు ఆయుష్ దవాఖాన..
ప్రభుత్వం జిల్లాకు 50 పడకలతో ఆయుష్ దవాఖానను మంజూరు చేసింది. ఇందుకోసం ఇప్పటికే రూ.15 కోట్లను మంజూరుచేసింది. రూ.7.50 కోట్లతో దవాఖానను నిర్మించనుండగా..మిగతా రూ. 7.50 కోట్లతో పరికరాలు, వెల్నెస్ సెంటర్ల నిర్వహణ తదితరాలకు ఖర్చు చేయనున్నారు. అయితే ఏడాదిలోగా ఈ దవాఖాన సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయుర్వేదం, యునాని, యోగా, ప్రకృతి చికిత్స, తదితర సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
రెండు విడుతల్లో కంటి వెలుగు…
ప్రతి ఒక్కరికీ కంటి చూపు అత్యవసరం. కండ్లు లేకపోతే వారి జీవితం అంధకారంగా మారుతుం ది. అందుకోసం ప్రతి ఒక్కరికీ కంటి చూపు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కం టి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నది. గతేడాదిలో చేపట్టిన మొదటి విడుత కార్యక్రమం జయప్రదం కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం రెండో విడుత కార్యక్రమాన్ని చేపట్టి అన్ని గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి మందులతోపాటు కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు 4,83,582 మందికి కంటి పరీక్షలు చేయగా, 64,785 మంది రీడింగ్ గ్లాసెస్ అందజేయడంతోపాటు 59,539 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను పంపిణీ చేశారు. సర్జరీలు అవసరమైన వారిని సరోజినీదేవి దవాఖానకు తీసుకెళ్లి శస్త్ర చికిత్సలు చేయించారు.
పల్లె, బస్తీ దవాఖానలు..
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానల మాదిరిగానే జిల్లాలోనూ పల్లె దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో 4 బస్తీ, 112 పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది.
37,176 మందికి కేసీఆర్ కిట్ల పంపిణీ..
కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతో ప్రభుత్వ దవాఖానలకు గర్భిణులు క్యూ కడుతున్నారు. సర్కారు దవాఖానల్లో డెలివరీ అయితే 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకంలో భాగంగా నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుండటం తో ప్రసవాల కోసం ప్రైవేట్ దవాఖానల కెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గింది. కాగా జిల్లాలో ఇప్పటివరకు 37,176 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేయ గా.. అమ్మఒడిలో భాగంగా సుమారు రూ.30 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది. కాగా ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్న ప్రసవాలన్నీ 80 శాతం సాధారణ ప్రసవాలే కావడం గమనార్హం.
కేసీఆర్ కిట్ను ఇవ్వడం బాగుంది
ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానలో సోమవారం చేరాను. ప్రసవం అనంతరం వైద్యులు నాకు కేసీఆర్ కిట్ను అందజేశారు. అందులో బిడ్డకు కావాల్సిన సామగ్రి ఉన్నది. ఆరు నెలలపాటు సరిపోతుంది. కిట్ను ఇవ్వడం చాలా బాగుంది. ప్రసవం అనంతరం కిట్ను అందిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-సంధ్యారాణి, మద్గుల్చిట్టంపల్లి, వికారాబాద్