కొడంగల్, నవంబర్ 3 : సర్కారు బడి అంటే గతంలో చిన్నచూపుగా ఉండేది. చదువు సరిగా ఉండదని, సౌకర్యాలు ఉండవని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సాయంతో సర్కారు బడుల రూపురేఖలు మారాయి. ఉపాధ్యాయుల ప్రత్యేకంగా శ్రద్ధతో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ‘మన ఊరు-మన బడి’తో మౌలిక వసతులు సమకూరాయి. దీంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా బడికి వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు.
పాతకొడంగల్ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారింది. గతంలో సౌకర్యాలు లేక 28 మంది విద్యార్థులు మాత్రమే వచ్చేవారు. ప్రస్తుతం 64 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు క్రాంతికుమార్, ఉపాధ్యాయురాలు సంధ్యలు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆట, పాటలతో పాటు విద్యార్థులకు విజ్ఞానాన్ని, మనో వికాసాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కొడంగల్ పట్టణానికి చెందిన ప్రతిభ సహకారంతో పాఠశాలల గోడలపై ఓనమాలు, ఆంగ్ల పదాలు, ఏబీసీడీలు, గుణింతాలు, పండ్ల పేర్లు, రాష్ట్ర, జాతీయ చిహ్నాలు తదితర బొమ్మలను చిత్రీకరించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మిషన్ భగీరథ కింద నల్లాలు వేయగా, మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం నవోదయ, గురుకుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలో చేరే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నది.