తాండూరు, సెప్టెంబర్ 24 : ఈ నెల 27న తాండూరులో మంత్రి హరీశ్రావు పర్యటన చేపట్టి రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెల్లడించారు. ఆదివారం తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. రూ.25 కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి, రూ.10.23 కోట్లతో జినుగుర్తి, కందనెల్లి, చంద్రవంచ, జుంటుపల్లి పరిధిలో సబ్స్టేషన్ల ఏర్పాటు, రూ.10 కోట్లతో వ్యవసాయ మార్కెట్ నిర్మాణం, రూ. ఒక కోటితో గ్రంథాలయ భవన నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
అనంతరం విలేమూన్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ముందుంటూ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.