న్యూఢిల్లీ : తాను దిమాగీ నక్సల్ అని చెప్పుకోడానికి గర్వపడుతున్నానని మాజీ సీఎం కేజ్రీవాల్ సోమవారం అన్నారు. తాను నిజమైన దేశభక్తుడిని అని.. బీజేపీకి భయపడబోనని చెప్పారు. 80వ స్వాతంత్య్ర వేడుకల్లో నరేంద్ర మోదీ చేసిన దిమాగీ నక్సల్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కేజ్రీవాల్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ ప్రకారం ప్రశ్నించేవారు, బీజేపీకి భయపడని వారు దిమాగీ నక్సల్స్ అయితే.. అంబేద్కర్, భగత్సింగ్ బతికుంటే వారిని కూడా దిమాగీ నక్సల్స్ అని పిలిచేవారని వ్యాఖ్యానించారు. మెరుగైన సమాజం, నాణ్యమైన దవాఖానలు, మెరుగైన డ్రైనేజీ సదుపాయాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, అవినీతి లేని పాలనను కోరుకునే వారు మోదీ దృష్టిలో దిమాగీ నక్సల్స్ అని కేజ్రీవాల్ విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కూడా తాను దిమాగీ నక్సల్ అని చెప్పుకోడానికి గర్వపడుతానని ఓ ప్రకటనలో తెలియజేశారు.