పరిగి, జనవరి 6 : ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం శనివారం ముగిసింది. డిసెంబర్ 28 నుంచి ఈనెల 6వ తేదీ శనివారం వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో అభయహస్తం కింద 2,74,470 దరఖాస్తులు అందగా, ఇతర దరఖాస్తులు 39,620 దరఖాస్తులు అందాయి. రెండు సెలవు రోజులను మినహాయించి 8 పనిదినాల్లో గ్రామసభలు నిర్వహించారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 19 మండలాల్లో 566 గ్రామపంచాయతీలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 57 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా 668 గ్రామసభలు నిర్వహించారు. గ్రామపంచాయతీలకు కేటాయించిన రోజున గ్రామసభలు నిర్వహించగా, మున్సిపాలిటీలలోని వార్డుల్లో ప్రతి రోజూ ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు.
ప్రజాపాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తుల డేటాను వెబ్సైట్లో నమోదు చేసేందుకు జిల్లాలో 57 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. ప్రతి రోజూ రెండు షిఫ్టుల్లో పది మంది చొప్పున డేటా ఎంట్రీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
నమోదు చేసిన తర్వాత యూనిక్ నెంబర్ను రెడ్ పెన్తో దరఖాస్తు పై భాగంలో రాసి దరఖాస్తు చివరి భాగంలో ఎంట్రీ చేసిన ఆపరేటర్ పేరు, సంతకం చేయాలని కలెక్టర్ సూచించారు. వేగంగా డేటా ఎంట్రీ కోసం ఇంటర్నెట్ సదుపాయంతోపాటు నిరంతర విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.