చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 12 : వ్యవసాయ రుణ గ్రహితలకు వారి ఆర్థిక ఆసక్తి, పొదుపు అలవాట్లని ప్రోత్సహిస్తూ.. స్వల్ప, మధ్యకాలిక రుణాలు సకాలంలో మంజూరు .. సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల్ పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం). చేవెళ్ల మండలంలో చేవెళ్ల, ఆలూర్, గుండాల, ముడిమ్యాల్ గ్రామాల్లో 4 పీఏసీఎస్లు ఉన్నాయి. ఇందులో ప్రాంతీయ అసమానతల తొలగింపునకు… స్థానిక ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సొసైటీ ముడిమ్యాల్ సొసైటీ బ్యాంకు ముందుకు సాగి విశేషమైన సేవలు అందిస్తున్నది.
ముడిమ్యాల్ పీఏసీఎస్కు ముడిమ్యాల్, రావులపల్లి, కుమ్మెర, మల్కాపూర్, గొల్లపల్లి, ధర్మసాగర్, కందవాడ, నారాయణ్దాస్గూడ, మల్లారెడ్డిగూడ, ఎర్రోనికొటాల గ్రామాల పరిధిలోని రుణ గ్రహితలకు స్వల్ప, మధ్యకాలిక రుణాలను అందిస్తున్నది. ప్రజలకు దూర భారం లేకుండా అనువుగా ఉండేందుకు ఈ బ్యాంకు పరిధిలో మల్కాపూర్, కందవాడ గ్రామాల్లో రెండు శాఖలను అదనంగా ఏర్పాటు చేశారు.
పంట రుణాలు, దీర్ఘకాలిక, బంగారు, ఎన్ఎఫ్ఎస్ (నాన్ ఎంప్లాయీస్ స్కీమ్స్), సేవింగ్ డిపాజిట్స్, ఫర్టీలైజర్స్, ఫెస్టీసైడ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ తదితర రుణాలను అందిస్తున్నది. పీఏసీఎస్ పరిధిలో 950 మంది రైతులకు పంట రుణాలు, 139 మందికి లాంగ్ టర్మ్ లోన్స్, 296 మందికి బంగారు రుణాలు, నిరుద్యోగిత కింద 50 మందికి, 1841 మంది సేవింగ్స్ డిపాజిట్, పిక్స్డ్ డిపాజిట్ రూ. 25 లక్షల వరకు చేశారని సొసైటీ చైర్మన్ గోనె ప్రతాప్రెడ్డి తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకారసంఘం ఆధ్వర్యంలో పురుగుల మందులు, ఎరువులు, విత్తనాలు నేరుగా డీలర్లతో సంప్రదించి వారికి అందజేస్తన్నారు. గోల్డ్ లోన్స్ కింద తులానికి రూ. 40 నుంచి 45 వేలు కేవలం 80 పైసల వడ్డీకి మాత్రమే అందజేస్తున్నారు. నాన్ ఎంప్లాయీస్ స్కీమ్ కింద కిరాణం షాపులు, పంక్చర్ షాపులు, బట్టల షాపులు, కటింగ్ షాపులు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు స్థానిక యువతకు రుణాలు ఇస్తున్నారు. మార్టిగేజ్ లోన్స్ కింద భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు తనాఖా పెట్టి రుణాలు ఇవ్వడం, గొర్రెలు, బర్రెలు, పౌల్టీఫాం, హార్వెస్టర్, పండ్ల తోటలు తదితర వాటిని ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు అందజేస్తున్నారు.
ముడిమ్యాల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మల్కాపూర్, రావులపల్లి, మల్లారెడ్డి గూడ అనుబంధ గ్రామం ఎర్రోని కొటాలలో ప్రజలకు మంచి నీటి సౌకర్యార్థం ఉచితంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు.
బంగారు రుణాలు, (ఎన్ఎఫ్ఎస్) నాన్ ఫాం సెక్టార్ స్కీమ్స్ కింద కేవలం మడిమ్యాల్ పీఏసీఎస్లోనే ఈ సేవలు అందుబాటులో ఉండడం విశేషం. చేవెళ్ల మండల ఫరిధిలోని మిగతా మూడు పీఏసీఎస్లలో ఇలాంటి సౌకర్యం లేదు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా ఈ స్కీమ్స్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తున్నది.
స్థానికంగా ఉన్న రైతులు, నిరుద్యోగులు, వ్యాపారం చేసుకునే వారు ఆర్థికంగా ఎదగడానికి, వారి అభివృద్ధికి ప్రాథమిక సహకార సంఘం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల ప్రజల అసమానతలను రూపుమాపడానికి అనేక స్కీమ్స్ ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం. మిగతా సొసైటీలతో పోలిస్తే మా పీఏసీఎస్లో అన్ని విధాలుగా రుణాల మంజూరు, తిరిగి చెల్లింపులలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాం. లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేశాం. రికవరీలోనూ ముందున్నాం.
– గోనె ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, ముడిమ్యాల్