ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 21 : నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో రూ.2,931కోట్లు విడుదల చేయించి, నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీ, గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయించానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రత్యేక రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించామన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు మండలాల్లో పలు అభివృద్ధి పనుల కోసం ఏసీడీపీ, ఎస్డీఎఫ్, బీఎంఎఫ్, హెచ్ఎండీఏ, టీయూసీడీఎఫ్, పంచాయతీరాజ్, టీఎస్ఐఐసీ, ఎన్సీడీపీ, హెచ్ఆర్డీసీల నుంచి సుమారు రూ.471కోట్ల నిధులు విడుదల చేయించటంతో పాటు ప్రొసీడింగ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో 100 పడకల ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్ కోసం రూ.37 కోట్లు, పెద్దచెరువు సుందరీకరణకు రూ.18 కోట్లు, బైపాస్రోడ్డు వెడల్పు కోసం రూ.3.50 కోట్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, తుర్కయంజాల్కు రూ.15 కోట్లు, ఆదిబట్ల రూ.5 కోట్లు, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీకి రూ.10కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రధాన రోడ్ల వెంట వంతెనల నిర్మాణం, రోడ్డు వెడల్పు పనుల కోసం నిధులు సిద్ధంగా ఉన్నందున ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
కొహెడ సమీపంలో పండ్ల మార్కెట్ నిర్మాణం కోసం రూ.450 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్యారంటీల సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు చేసేందుకు నిర్లక్ష్యం వహిస్తున్నందున వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు రైతుబంధు కోసం వెయ్యికండ్లతో ఎదురుచూస్తున్నారని, వెంటనే నిధులను విడుదల చేయాలన్నారు.
నష్టాల్లో ఉన్న రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి జీడీపీవో దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దే అని మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడ్డారంటూ అసెంబ్లీలో పొంతనలేని లెక్కలు చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో తాగునీరు, రోడ్ల వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ, రైతులకు పెట్టుబడి సాయం, పరిశ్రమల ఏర్పాటుతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇవేమీ చూడకుండా ఇంటి సంసారాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం కాంగ్రెస్కు సరైంది కాదన్నారు. శ్వేతపత్రం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.