వికారాబాద్, సెప్టెంబర్ 19 : ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్ జిల్లా స్వీప్ ఐకాన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్వీప్లో భాగంగా ఓటరు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా సమావేశానికి వచ్చిన విద్యార్థులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. చిన్నారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాడ్, బ్యాలెట్ యూనిట్ ఆధారంగా డెమో ఓటర్ వేసే విధానాన్ని వికారాబాద్లోని ఆయా కళాశాలల విద్యార్థులకు చూపించారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వికారాబాద్ అంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల రోజు తమ వాట్సాప్ స్టేటస్ ద్వారా ఓటు వినియోగంపై మెసేజీలను పొందుపరచాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వికారాబాద్ ప్రాంతానికి మంచి భవిష్యత్ ఉందని ఆయన తెలిపారు.
దేశంలోనే వికారాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలి
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రాబోవు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని దేశంలోనే వికారాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అతి పెద్ద ప్రలోభాలు డబ్బు, మద్యం అని.. వాటికి లొంగకుండా ఎన్నికల్లో నిర్భయంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గత ఎన్నికల్లో 76 శాతం ఓటింగ్ పోలింగ్ జరిగిందని, ఈసారి ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ జరగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సాయి శ్రీనివాస్ను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు విజయకుమారి, శ్రీనివాస్రావు, స్వీప్ నోడల్ అధికారి కోఠాజీ, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రెస్మీట్
స్వీప్ చాలా మంచి విషయం, ఈ మంచి పనికి నన్ను పిలువడం చాలా బాగుందని సాయి శ్రీనివాస్ అన్నారు. ఓటుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీలైనప్పుడల్లా వికారాబాద్కు వచ్చి అందరినీ కలుసుకుంటానన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని దేవున్ని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. అనంతరం సాయి శ్రీనివాస్తో విద్యార్థులు ఫొటోలు, సెల్ఫీలు దిగారు.