పరిగి, ఫిబ్రవరి 27: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిగజారి మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆదివారం పరిగిలోని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ ‘మిస్టర్ రేవంత్రెడ్డి ..నాకు కోడి గుడ్లు అమ్ముకోవడమే తెలుసని అన్నావు.. కానీ నాకు గుడ్లను అమ్ముకోవడంతోపాటు అన్నీ తెలుసు’ అని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి అభివృద్ధి, అందుబాటు అనే నినాదంతో వచ్చినట్లు చెప్పారు. తాను ఎంపీగా విజయం సాధించినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నట్లు చెప్పారు. నేనే చేసే వ్యాపారం పౌల్ట్రీ అని, రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోని చాలామందికి తెలుసన్నారు. తాను గుడ్లు అమ్మితే తప్పేమిటని ప్రశ్నించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా.. ఏ అంశంపైనైనా చర్చకు తాను సిద్ధమని రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. రూ.30 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు రూ.18వేల కోట్ల పైచిలుకు పూర్తి కాగా, ఆ పనులకు సంబంధించిన బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు. పనులు జరుగుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు.
నాగం జనార్దన్రెడ్డి కోర్టులో పిల్ వేసి అడ్డుకున్నారని, బీజేపీ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లి పనులు నిలిచిపోయే లా చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆరు లిఫ్టులతో 12.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఎత్తిపోతల పథకం పనులను చేపడుతున్నదన్నారు. రంగారెడ్డి జిల్లాలో 4.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రంలోని రైతులపై ప్రేముంటే పార్లమెంటులో ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలంతా వెల్లోకెళ్లి ఆందోళన చేస్తుంటే, తమతో కలిసి ఆందోళనలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు విషయాన్ని బహిరంగంగా మాట్లాడుదామంటే బీజేపీ ఎంపీలు రాలేదని, కేంద్రమంత్రి కిషన్రెడ్డిని అడిగిన ఫలితంలేదన్నారు. కాంగ్రెస్ ఎంపీలతో రాష్ర్టానికి ఒరిగిందేమి లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చినట్లు ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దని, ఏమైనా ఉంటే నిరూపించాలని ఎంపీ రంజిత్రెడ్డి సవాల్ విసిరారు.
తాను గుడి మాన్యాలు ఎక్కడ మింగానో నిరూపిస్తే.. ఆ భూములను నీకే రాసిస్తానని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి రేవంత్రెడ్డికి సవా ల్ విసిరారు. నీవు ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డావని, తాము అలాంటి వారిమి కాదన్నారు. ప్రభుత్వం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలపై రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాపై అతడికి సరైన అవగాహన లేదని, 2007లో ప్రాణహిత-చేవెళ్లను పరిగి వరకు తీసుకొస్తానని అప్పటి సీఎం వైఎస్సార్ చెప్పారని, 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నదని, ప్రాణహిత-చేవెళ్లకు ఎన్ని డబ్బులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయిన ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల నుంచి జిల్లాకు నీరు రావ డం ఇబ్బంది అనే విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయించిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరలోనే పూర్తవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎంపీ రంజిత్రెడ్డి గుడ్లు అమ్ముకుంటే తప్పా అని ప్రశ్నించారు. ఎంపీగా ఆయన పార్లమెంట్లో తన వాణిని వినిపిస్తున్నారని, నీవు ఎంపీగా ఉండి ఏమి చేస్తున్నావని మండిపడ్డారు.
నీకు దమ్ముంటే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావాలని సూచించారు. రేవంత్రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వికారాబాద్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు అరవిందరావు, మల్లే శం, సత్యమ్మ, జడ్పీటీసీలు నాగారెడ్డి, హరిప్రియ, మేఘమాల, రాందాస్, మున్సిపల్ చైర్మన్ అశోక్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రవీణ్కుమార్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సర్పంచ్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పెద్దేముల్, ఫిబ్రవరి 27: రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకుంటే నువ్వు ఎక్కడ కనిపించినా అడ్డుకుంటామని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్చారి హెచ్చరించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం గాజీపూర్ గ్రామంలో సర్పంచ్ వీరప్పతో కలిసి ఆయన రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మాట్లాడుతూ రంజిత్రెడ్డి నియోజకవర్గాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. చేవెళ్ల ఎంపీని విమర్శించే అర్హత నీకు లేదని, ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంగమేశ్వర్, వెంకటేశ్ గౌడ్, అంజి, రాజు, చింటు, శ్రీను, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.