లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని మూడోసారి దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నది. గత డిసెంబర్ చివరి వారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక దఫా సమావేశాన్ని నిర్వహించగా, శుక్రవారం మరోసారి చేవెళ్ల ఎంపీ స్థానంపై తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గెలుపు దిశగా అడుగులు వేయాలని గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
చేవెళ్ల ఎంపీ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. బీఆర్ఎస్కు మెజార్టీ ఓట్లు ఉండడంతో మరోసారి గెలిచే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, మాజీ మంత్రులు హరీశ్రావు, పట్నం మహేందర్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొనగా, ఏడు నియోజకవర్గాల పరిధిలోని తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, గులాబీ శ్రేణులు హాజరయ్యారు.
– రంగారెడ్డి, జనవరి 5(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహిస్తుండగా.. గత డిసెంబర్ చివరి వారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలపై ఒక దఫా సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం మరో దఫా చేవెళ్ల లోక్సభ స్థానంపై తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం జరిగింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి చర్చించారు. చేవెళ్లలో మరోమారు గెలిచి హ్యాట్రిక్ కొట్టేలా పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. గెలుపు దిశగా గులాబీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సన్నాహక సమావేశం పార్టీ కేడర్లో నూతనోత్సాహాన్ని నింపింది. సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, మాజీ మంత్రులు హరీశ్రావు, మహేందర్రెడ్డి, సబితారెడ్డి, నిరంజన్రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ రంజిత్రెడ్డి, తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేస్తూనే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని ఈసారి కూడా ఎలాగైనా గెలుచుకునేందుకు అవలంబించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. 2009లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ లోక్సభ పరిధిలో ఉన్నాయి.
జనరల్ కేటగిరిలో ఉన్న ఈ స్థానానికి ఇప్పటివరకు మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు బీఆర్ఎస్ విజయం సాధించింది. 2019లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలుపొందిన గడ్డం రంజిత్రెడ్డి ఈసారి కూడా ఇదే స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉంటున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయా స్థానాల్లో లక్షకు పైగా మెజార్టీ ఓట్లు బీఆర్ఎస్కు వచ్చాయి. మరోసారి గెలుపు అవకాశం బీఆర్ఎస్కే ఉండే అవకాశం ఉందని పలువురు పేర్కొన్నారు.
సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాశ్గౌడ్, యాదయ్య, బీఆర్ఎస్ యువనేత కార్తీక్రెడ్డి, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పార్టీల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నేతలున్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. మాజీ మంత్రి హరీశ్రావు కలుగజేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుండదు. వచ్చే అన్ని ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీదే. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో ప్రజలు బాధపడుతున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు తేడా 1.8 శాతం ఓట్లు మాత్రమే. మా బలం.. బలగం కేసీఆర్. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో సన్నాహక సమావేశంలో చర్చించుకున్నాం.