యాసంగి ధాన్యం కొనుగోలుకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లావ్యాప్తంగా 46,324 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణకు 15 లక్షల గన్నీ బ్యాగులు అవసరంకానుండగా, ఇప్పటికే 13 లక్షలకు పైగా బ్యాగులను సమకూర్చారు.
రంగారెడ్డి, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా యాసంగిలో పండిన ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికార యంత్రాంగం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి మనదైన పాలన ఏర్పడ్డాక రైతులకు ‘మిషన్ కాకతీయ’ ద్వారా సాగు నీటికి, ‘రైతు బంధు’ ద్వారా రెండు కాలాల పెట్టుబడులకు కొరత లేకుండా పోయింది. కుంటలు, చెరువులు, పలు జలాశయాలు నిండటంతో వ్యవసాయ సాగుకు తిరుగులేకుండా పోయింది. జిల్లా మొత్తంగా యాసంగి కాలంలో పలు రకాల పంటల సాగు 78,712 ఎకరాల్లో కాగా.. అందులో 46,324 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.
ఇందుకుగాను జిల్లా అధికార యంత్రాంగం జిల్లాలో 545 క్వింటాళ్ల వరి విత్తనాలు, రైతులకు కావాల్సిన ఎరువులను కూడా అందుబాటులో ఉంచి పంపిణీ చేసింది. జిల్లాకు సంబంధించి యాసంగిలో వరి పంటకు ప్రధానంగా కావాల్సిన యూరియాను 6,868.195 మెట్రిక్ టన్నులను రైతులకు అందుబాటులో ఉంచింది. మార్క్ఫెడ్, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద వీటిని నిల్వ ఉంచింది. యూరియా ఎరువులు నిరంతరం, కంపెనీల నుంచి జిల్లాకు సరఫరా అయ్యేలా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. ఆ ఎరువులను తిరిగి గ్రామాలకు సకాలంలో సరఫరా అయ్యేలా చూసుకుంది.
కొనుగోలు కేంద్రాలకు 60 వేల మెట్రిక్ టన్నులు
యాసంగి కాలంలో సాగైన వరి పంటల ద్వారా జిల్లావ్యాప్తంగా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి మించి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను జిల్లావ్యాప్తంగా 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు తరలి రానున్న వరి ధాన్యం గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ. 2,060., గ్రేడ్ ‘బీ’ రకానికి రూ. 2,040 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. వరి ధాన్యం సేకరణకు కావాల్సిన గన్నీ బ్యాగులను ఇప్పటికే సిద్ధం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఆయా కేంద్రాలన్నింటికీ కలిపి 15 లక్షల గన్నీ బ్యాగులు అవసరమవ్వగా, ఇప్పటికే 13 లక్షలకు పైగా బ్యాగులను సమకూర్చారు. మిగతా బ్యాగులను సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణను ఏప్రిల్ రెండు లేదా మూడో వారం నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనప్పటికీ రైతులు పండించిన వరిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. జిల్లాలో వాన కాలంలో జిల్లావ్యాప్తంగా సివిల్ సైప్లెస్ శాఖ వారు 38 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 20,410 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే అమ్మాలి
– శ్యామారాణి, డీఎం, సివిల్ సప్లయి, రంగారెడ్డి జిల్లా
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన 37 కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలి. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే సమయంలో రైతులు పాసు పుస్తకాలు, బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులను తీసుకొని రావాలి. యాసంగిలో పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తాం. ఆయా కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఏప్రిల్లో రెండు లేదా మూడో వారం నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం.