రంగారెడ్డి, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : కనుమరుగై పోయిందనుకున్న కరోనా జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో ప్రజలను భయపెడుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతానికి ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కట్టడికి సంబంధించిన ముందస్తు చర్యలను చేపట్టేందుకు ఉపక్రమించింది. కొవిడ్ను ఎదుర్కునేందుకు అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
కరోనా తీవ్రరూపం దాల్చినా.. అందుకు తగ్గట్టుగా వైద్య సేవలు అందించేందుకు బెడ్లు, మందులను సమకూర్చేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్లు ధరించడంతోపాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. కరోనా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసే ఏర్పాట్లలో జిల్లా వైద్య శాఖ నిమగ్నమైంది. కొండాపూర్లోని జిల్లా కేంద్ర ఆసుపత్రి, వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రితోపాటు జిల్లాలో ఉన్న 37 పీహెచ్సీలు, 11 సీహెచ్సీలు, 24 అర్బన్ పీహెచ్సీలలో కొవిడ్ చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన మేర ఆక్సిజన్ను అందుబాటులో ఉంచడంతోపాటు ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కొవిడ్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కొత్త వేరియంట్ పెద్దగా ప్రభావం చూపదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు పూర్తి జాగ్రత్తలు పాటించాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. పీహెచ్సీల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బెడ్లు సిద్ధం చేశాం. మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. వైద్య సాయం విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో, రంగారెడ్డిజిల్లా