వికారాబాద్, నవంబర్ 29 : పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తుల ప్రక్రియను డిసెంబర్ 2లోపు చేపట్టాలని కళాశాలల ప్రిన్సిపాల్స్ను వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలపై సంబంధిత శాఖ అధికారులతో కలిసి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్, సహాయ సంక్షేమ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో 85 వివిధ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి 11,475 మంది విద్యార్థులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా.. 6,530 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. నూతనంగా 7,084 మంది ఉపకార వేతనాలకు అర్హులు కాగా.. కేవలం 2,291 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారని వివరించారు. పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. నూతనంగా ఉపకార వేతనాలకై దరఖాస్తు చేసుకునే ప్రక్రియను డిసెంబర్ 5లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎస్సీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 647 మంది రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా.. 566 మంది 9, 10వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. న్యూ స్కీం కింద 5 నుంచి 8వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న 692 మంది రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా 506 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు తోడ్పాటునందించాలని సూచించారు. ఎక్కువ మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తే అధికారులకు, జిల్లాకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. అధికారులు, పాఠశాలల ప్రిన్సిపాల్స్ సమన్వయంతో పని చేసి 100 శాతం ఉపకార వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశాలకు వచ్చే ముందు పక్కా సమాచారంతో రావాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, జిల్లా ఇంటర్మీడియల్ అధికారి శంకర్నాయక్ పాల్గొన్నారు.