రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఉద్దేశం ఫలించింది. రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలు పటిష్టంగా మారాయి. చెరువుల్లో చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు పూడిక తీత, చెరువు కట్టలను పునర్నిర్మించడంతో వాటి రూపురేఖలు మారడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరిగింది. ఈ నెలలో సరాసరి 31.10సెం.మీ కుండపోత వర్షం కురిసినా ఒక్క చెరువు కూడా చెక్కుచెదరలేదు. గత ప్రభుత్వాల హయాంలో వానొస్తే చెరువుకు గండి పడిందన్న మాటలే ఎక్కువగా వినిపించేవి. చెరువుల పునరుద్ధరణకు జిల్లాలో ‘మిషన్ కాకతీయ’ కింద ఇప్పటివరకు నాలుగు విడుతల్లో రూ.132.95కోట్లను ప్రభుత్వం వెచ్చించి 956 చెరువులకు పునరుజ్జీవం కల్పిచింది. గత ఏడాది రూ1.25కోట్ల ఖర్చుతో 50 చెరువులకు మరమ్మతులు చేపట్టింది. అంతేకాకుండా ‘మిషన్ కాకతీయ’తో ఫీడర్ చానళ్లు, పిల్ల కాలువలు సైతం బాగుపడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో దాదాపుగా చెరువులు నిండగా, 203కి పైగా మత్తడి దుంకుతున్నాయి. ఈ ఏడాదంతా సాగు, తాగునీటికి ఢోకాలేదని జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : వర్షం పడిందంటే చాలు.. ఒకప్పుడు రైతుల నోట ‘చెరువుకు గండి పడిందన్న’ మాటలే వినబడేవి. అప్పటివరకు నిండు కుండల్లా ఉన్న చెరువులు కొద్దిపాటి ‘గండి’కే ఖాళీ అయి పంటల సాగు ప్రశ్నార్థకమయ్యేది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేశాక చెరువుల రూపురేఖలే మారిపోయాయి. జీవం కోల్పోయిన చెరువులకు ఈ పథకం కల్పతరువుగా మారింది. ఎన్నో ఏండ్లుగా వినిపిస్తూ వచ్చిన ‘గండ్లు’ అనే మాటకు ఈ పథకం చరమగీతం పడింది. రంగారెడ్డి జిల్లాలో జూలై నెలలో కుండపోతలా కురిసిన వర్షాలకు సైతం చెక్కుచెదరక నిలిచిన మిషన్ కాకతీయ చెరువులే ఇందుకు ఉదాహరణ. ఇప్పటివరకు నాలుగు విడుతల్లో 956 చెరువులకు రూ.132.95 కోట్లు వెచ్చించి ప్రభుత్వం పూర్వవైభవం తెచ్చింది. ఒక్క జూలై నెలలోనే జిల్లావ్యాప్తంగా 31.10 సెం.మీ పైగా వర్షం కురిసినప్పటికీ మిషన్ కాకతీయ పథకం కింద మరమ్మతులు చేపట్టిన ఏ ఒక్క చెరువు కూడా ‘గండి’బారిన పడలేదు. ఫలితంగా నీటి వృథాకు సైతం అడ్డుకట్ట పడడంతో రైతాంగానికి కడగండ్లు సైతం తప్పాయి.
జిల్లాలో మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలు ఇచ్చింది. దశాబ్దాల తరబడిగా మట్టికట్టలు మరమ్మతులకు నోచుకోక.. నీళ్లు నిలువక.. నోళ్లు తెరిచిన చెరువుల పాలిట ఈ పథకం కల్పతరువుగా మారింది. ఏండ్ల తరబడిగా వినిపిస్తూ వస్తున్న ‘గండ్లు’ అనే మాట నేడు వినబడకపోగా.. రైతుల కడగండ్లను సైతం ఈ పథకం తీర్చింది. తెలంగాణ ప్రభుత్వం దూరదృష్టితో.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం మూలంగా.. చెరువుల స్వరూపం.. ఏండ్ల తరబడి దగాపడ్డ జిల్లా ప్రజల బతుకు చిత్రం మారింది. పూర్వ వైభవం సంతరించుకున్న నీటి వనరులతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. బోరు బావుల్లో జలకళ వచ్చింది. మొత్తంగా సాగు, తాగు నీటి సమస్యలు కాలక్రమేణా శాశ్వతంగా సమసిపోతున్నాయి. వ్యవసాయ రంగం సైతం పురోభివృద్ధిని సాధిస్తున్నది. వ్యవసాయ అనుబంధ వృత్తుల ప్రజల జీవన గమనంలోనూ పెను మార్పులు వచ్చాయి. పశుపక్షాదులకు తాగునీరు, కుల వృత్తులకు సొంతూర్లలోనే చేతినిండా పని లభించడంతో ఆర్థిక పరిపుష్టి చేకూరుతున్నది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన మిషన్ కాకతీయ పథకం ఫలాలు.. జిల్లా ప్రజల జీవన శైలిలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి.
తాగు, సాగు నీటికి ఢోకా లేదు
జిల్లాలో మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలు ఇవ్వడంతో పూడికతో నిండిన చెరువులు.. కూరుకుపోయిన మట్టికట్టలు ప్రస్తుతం ఎక్కడా కన్పించడంలేదు. ‘గండ్లు’ అన్న మాటే లేకపోగా.. కురిసిన ప్రతి వర్షపు చుక్క కాలువల ద్వారా చెరువులకు అటు నుంచి పంట పొలాలకు చేరుతున్నది. బోరు బావుల్లో ఎక్కడ చూసినా పాతాళ గంగ ఉబికి వస్తున్నది. ఈసారి జూలైలోనే 31.10 సెం.మీ మేర వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతం కంటే 11.21 సెం.మీ ఎక్కువ. దీంతో మిషన్ కాకతీయతో పునరుజ్జీవం పొందిన ఎన్నో చెరువులు జలాలతో కళకళలాడుతున్నాయి. నీటి పారుదల శాఖ పరిధిలోని 203 చెరువులు మత్తడి పోస్తూ.. పంటల సాగుపై రైతుల్లో పూర్తి భరోసాను నింపుతున్నాయి. ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను ప్రతియేటా వదులుతుండడంతో మత్స్యకారులకు కూడా మిషన్ కాకతీయ చెరువులు ఆదరువు అవుతున్నాయి. పశు పక్షాదులకు నీరు అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది.
మిషన్ కాకతీయ ఫలితమే..
– బన్సీలాల్, ఇరిగేషన్ జిల్లా అధికారి
జిల్లాలో చెరువులన్నీ పటిష్ట స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో బాగు చేయడం, ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేసి చెరువులకు మరమ్మతులు చేపడుతున్నది. ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అవసరమైన మరమ్మతులను చేపడుతున్నారు. జూలై నెలలో భారీగా వర్షాలు పడ్డప్పటికీ ఒక్క చెరువుకు గండి కానీ, బుంగ కానీ పడలేదు. కాలువలు కూడా తెగిపోలేదు. ఇదంతా మిషన్ కాకతీయ ఫలితమే.
రూ.132.95 కోట్లతో 956 చెరువులకు పూర్వ వైభవం
జిల్లాలో ఒకప్పుడు జీవధారగా ఉన్న గొలుసుకట్టు చెరువులు వైభవాన్ని కోల్పోయాయి. వేల ఎకరాలకు సాగునీరు అందించిన వనరులు కళ తప్పి ఆదరణ కోల్పోయాయి. కొన్ని పూడుకుపోయాయి. ఇంకొన్ని ఆక్రమణల్లో కలిసిపోయాయి. మరికొన్ని ఉన్నా.. లేనట్టే అయ్యాయి. విశాలంగా ఉన్న చెరువులు కాస్తా.. కాలక్రమంలో నీటి గుంటల్లా మిగిలాయి. ఉన్న ఆ కొద్దిపాటి వనరుల్లోకి వర్షాకాలంలో నీళ్లొచ్చినా నిల్వ ఉండేది కొన్ని రోజులే. భారీ వరదలకు శిథిలమైన కట్టలకు ‘గండ్లు’ పడితే ఒక్క రోజులోనే చెరువులు ఖాళీ అయిన సందర్భాలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో అంతరించిపోతున్న జల వనరులను మళ్లీ పునరుద్ధరించాలన్న సదుద్దేశంతో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో రంగారెడ్డి జిల్లాలోని చెరువుల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి.
కాకతీయ రాజుల పాలనలో కళకళలాడిన గొలుసు కట్టు చెరువులు దశాబ్దాల కాలం తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 999 చెరువులకు మిషన్ కాకతీయ పథకం కింద పూర్వ వైభవం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు నాలుగు విడుతల్లో ఈ పథకం కింద రూ.132.95 కోట్ల వరకు నిధులను వెచ్చించి 956 చెరువులను బాగు చేసింది. కట్టలపై ఏపుగా పెరిగిన ముండ్ల పొదలను తొలగించారు. ఏండ్ల తరబడిగా మరమ్మతులకు నోచని తూములకు మరమ్మతులు చేపట్టారు. చెరువు అంతర్భాగంలో పేరుకుపోయిన పూడికను తొలగించారు. గత యేడాది ప్రభుత్వం రూ1.25 కోట్లను వెచ్చించి 50 చెరువులకు మరమ్మతులు చేపట్టింది. ప్రభుత్వ చర్యలతో చెరువులు పటిష్టంగా మారి ఇటీవల కురిసిన వర్షాలకు చెక్కుచెదరలేదు. ఒక్క చెరువు కట్టకు కూడా గండిపడలేదని, నీటి వృథా అనేదే లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పటిష్టపర్చడమే ఇందుకు కారణంగా వారు ఉదహరిస్తున్నారు. మిషన్ కాకతీయ పథకం లేకుంటే ప్రస్తుత వర్షాల కారణంగా జరిగే నష్టాన్ని ఊహించలేమని వారంటున్నారు.