సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు లోక్ సభ స్థానాల్లో ఎన్నికల సందడి షురూ అయ్యింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల దిశగా సమాయత్తమవుతుండడంతో త్వరలో ప్రచార కోలాహలం నెలకొననున్నది. ఇప్పటికే కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో పలు కార్యక్రమాలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోపక్క జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
-రంగారెడ్డి, మార్చి 18 (నమస్తే తెలంగాణ)
లోక్ సభ ఎన్నిలకు షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యాయి. త్వరితగతిన అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచార పర్వంలోకి దిగాలని భావిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో నింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల సమాయత్తంలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో లోటుపాట్లను విశ్లేషిస్తూ లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పార్టీ అధినేత కేసీఆర్తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులు దిశానిర్దేశం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు ఎంపీ స్థానాలు ఉండడంతో అన్ని స్థానాలను గెలుచుకునే దిశగా పార్టీ నేతలతో పాటు కార్యకర్తలంతా సమన్వయంతో ముందుకు సాగేలా ప్రణాళికలు సిద్ధ్దం చేశారు. చేవెళ్ల లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను అధిష్టానం ప్రకటించగా, మహబూబ్నగర్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డినే ఖరారు చేసింది.
అలాగే నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను రంగంలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక భువనగిరి స్థానానికి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కేసీఆర్ ఆచితూచిగా వ్యవహరిస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా, పార్టీ శ్రేణుల మనోభావాలకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలన్నదే అధినేత కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబ్నగర్కు డీకే అరుణను, భువనగిరికి బూర నర్సయ్యగౌడ్, నాగర్కర్నూల్కు సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత్ ప్రసాద్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉన్నది. చేవెళ్లకు అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఇంకా ఆ పార్టీలో సందిగ్ధత నెలకొన్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి అభ్యర్థిని ఖరారు చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తున్నది. మహబూబ్నగర్ స్థానానికి వంశీచంద్రెడ్డి పేరును ప్రకటించగా.. నాగర్కర్నూల్, భువనగిరి టికెట్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతున్నది.
లోక్ సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలను ముమ్మరం చేసింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఓటరు జాబితా సవరణ, ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియలలో వేగం పెంచింది. మరోపక్క ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఫ్లెక్సీల తొలగింపు, వాల్ రైటింగ్స్ను చెరిపివేయడంతోపాటు నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసి రాజకీయ పార్టీల ప్రభావం కనిపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో అనుసరించాల్సిన విధివిధానాలపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు.
స్టాటిక్ సర్వేలైన్స్, ఫ్లయింగ్ స్కాడ్ తదితర బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. పార్టీల అభ్యర్థుల ప్రచార సరళి పరిశీలన, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను నిరోధించడం, ఫిర్యాదులపై తక్షణం స్పందించడం తదితర వాటిపై ఆయా బృందాలు దృష్టి సారించనున్నాయి. నగదు రవాణాపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. రూ.50వేలకు పైబడి నగదు వెంట తీసుకెళ్తే అందుకు సంబంధించిన ఆధారాలు పక్కాగా ఉండాలి. లేదంటే సీజ్ చేసి కోర్టులో అప్పగించనున్నారు.