పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. అటవీ భూములను సంరక్షిస్తూ.. పోడు భూములపై ఆధారపడి జీవించే గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు త్వరలో అందనున్నాయి. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీకి సంబంధించిన ఫైల్పై సంతకం చేయడంతో వికారాబాద్ జిల్లాలోని పోడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని 438 మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. వీరికి త్వరలో పట్టాతోపాటు డిజిటల్ పాసు పుస్తకాలు అందనున్నాయి.
బొంరాస్పేట, ఏప్రిల్ 30 : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న పోడు రైతుల కల ఎట్టకేలకు నెరవేరింది. దశాబ్దాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతుల చేతికి పట్టాలు అందనున్నాయి. పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతల కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పోడు భూముల పట్టాల పంపిణీ చేసే ఫైలుపై సంతకం చేయడంతో జిల్లాలోని పోడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 438 మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. వీరందరికీ త్వరలో పట్టాతో పాటు డిజిటల్ పాసు పుస్తకాలు అందనున్నాయి.
సీఎం కేసీఆర్ చొరవతో అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు చేతికి రానున్నాయి. ఇప్పటికే పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హులైన వారి తుది జాబితాను తయారు చేశారు. అర్హులైన పట్టాదారులకు పంపిణీ చేయడానికి పట్టాదారు పాసు పుస్తకాలను కూడా సిద్ధంగా ఉంచారు. సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీ ఫైలుపై సంతకం చేయడంతో త్వరలో రైతుల చేతికి పట్టాలు అందనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పోడు రైతులకు రైతు బంధు పెట్టుబడి సాయంతో పాటు రైతు బీమా, బ్యాంకుల్లో పంట రుణాలు అందనున్నాయి. ఎన్నో ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా పట్టాలు లేక ఇబ్బందులు పడ్డ రైతులు ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 114 గ్రామపంచాయతీల పరిధిలో 22,485 ఎకరాల్లో పోడు భూములను 9973 మంది గిరిజన, గిరిజనేతర రైతులు గత కొన్నేండ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీరిలో 438 మంది రైతులను అసలైన పోడుదారులుగా జిల్లా అధికారులు గుర్తించారు. వీరిలో కులకచర్ల మండలంలో 186, పరిగిలో 77, ధారూరులో 54, దోమలో 28, పూడూరులో 6, చౌడాపూర్లో 33, పెద్దేముల్లో 11, బషీరాబాద్లో 7, యాలాలలో 30, కొడంగల్ మండలంలో ఆరుగురు రైతులు ఉన్నారు.
– గోపాల్నాయక్, కిష్టాపూర్ పలుగుతండా
నూతన సచివాలయంలో ఆదివారం కొలువుదీరిన సీఎం కేసీఆర్ వెంటనే గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలిచ్చే ఫైల్పై సంతకం చేసి గిరినులపై ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నో యేండ్లుగా గిరిజనులకు పోడు భూములను ఇచ్చే మహత్తర కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సర్కారు చేసి చూపించింది.
– ప్రవీణ్కుమార్, నాగసముందర్
పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసే ఫైలు పై సీఎం కేసీఆర్ సంతకం చేయడం సంతోషించదగ్గ విషయం. ఎన్నో ఏండ్ల నుంచి అటవీ భూములు సాగుచేసుకుంటున్న పోడు రైతులకు యాజమాన్య హక్కులు దక్కేలా చేసిన సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు.