వికారాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తుండగా, కొత్తగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత జాగ ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ సాయాన్ని ఒక్కో విడుతలో రూ.లక్ష చొప్పున మూడు విడుతల్లో అందజేయనున్నది. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది మహిళలకు వర్తింపజేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకుగాను 24 వేల మందికి, వికారాబాద్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకుగాను 12 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. గృహలక్ష్మి పథకంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ‘డబుల్’ ఇండ్ల నిర్మాణాలు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లావాసులు జేజేలు పలుకుతున్నారు.
గూడు లేని ప్రతి నిరుపేదకూ సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. ఇందులో భాగంగా ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండగా.. కొత్త గా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా ఇల్లులేని వారికి ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించనున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేని వారికి రూ.మూడు లక్షల చొప్పున ఆడబిడ్డల పేరిట ఆర్థిక సహాయాన్ని అందించాలని బీఆర్ఎస్ ప్ర భుత్వం నిర్ణయించింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 3 వేల చొప్పున మొత్తం 12 వేల మంది పేదలకు లబ్ధి చేకూరనున్నది. అయితే ఈ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం 3 విడుతలుగా రూ.లక్ష చొప్పున అందించనున్నది. అంతేకాకుండా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వా ల హయాంలో వివిధ గృహనిర్మాణ పథకాల కింద లబ్ధిదారుల వాటాతో నిర్మించిన ఇండ్లకు సంబంధించిన అప్పును కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని కూడా అమ లు చేయాలని నిర్ణయించిన దృష్ట్యా జిల్లాకు మం జూరైన రెండు పడకల ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
శరవేగంగా డబుల్ బెడ్రూం పనులు..
జిల్లాకు మంజూరైన డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే యాలాల మండలంలోని కోకట్, కుల్కచర్ల మండలంలోని అడవివెంకటాపూర్, ధారూర్ మండల కేంద్రం, మర్పల్లి, మోమిన్పేటల్లో డబుల్ బెడ్ రూం ఇం డ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ నెలాఖరులోగా ఆ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ సం బంధిత అధికారులను ఆదేశించారు. యాలాల మండలం కోకట్లో నిర్మిస్తున్న 420 డబుల్ బెడ్రూం ఇండ్లలో 180 ఇండ్లు, ధారూర్ మం డల కేంద్రంలోని 120 ఇండ్లు, మర్పల్లి మండల కేంద్రంలోని 120 ఇండ్లు, మోమిన్పేట మండల కేంద్రంలోని 130 ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.4.03 కోట్ల ను ఇప్పటికే విడుదల చేసింది. మరోవైపు కుల్కచర్ల మండలంలోని అడవివెంకటాపూర్లో నిర్మిస్తున్న 30 రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనులతోపాటు మౌలిక వసతుల పనులూ ఇప్పటికే పూ ర్తయ్యాయి.
జిల్లాకు ప్రభుత్వం 3,800 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయగా.. వాటికి ఇప్పటికే పరిపాలన అనుమతులు రాగా.. అం దులో 2,257 ఇండ్ల నిర్మాణాలు ఆయా దశల్లో సాగుతున్నాయి. తాండూరు నియోజకవర్గానికి 1,500 లకుపైగా రెండు పడకల ఇండ్లు మం జూరు కాగా ఇప్పటివరకు 1,001 ఇండ్ల నిర్మా ణం ఆయా దశల్లో కొనసాగుతున్నది. వికారాబాద్ నియోజకవర్గానికి 526, పరిగి నియోజకవర్గానికి 430, కొడంగల్ నియోజకవర్గానికి 300 డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించగా నిర్మాణాలు ఆయా దశల్లో ఉన్నాయి. అదేవిధం గా చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మం డలానికి సంబంధించి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ ఖర్చు రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా యూనిట్ వ్యయంతోపాటు మౌలిక వసతుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.25 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలను డ్రైనేజీ, నీటి వసతి తదితర మౌలిక వసతుల కో సం అందజేస్తున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి 500 చదరపు గజాల్లో రెండు రెం డు పడకల గదులు, హాల్, వంటగది ఉండేలా నిర్మిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో..24 వేల మందికి లబ్ధి
నిరుపేదలకూ సొంత ఇండ్లు ఉండాలని.. వారు కూడా ఆత్మగౌరవంతో జీవించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ గత శాసనసభ సమావేశాల్లో చెప్పినట్లుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని పేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయించడంతో జిల్లాలోని నిరుపేదల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ గృహలక్ష్మి పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటే స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 58, 59లకు సంబంధించి 2014 వరకు ఉన్న కటాఫ్ గడువును 2020 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో జిల్లాలోని లక్షలాది మందికి మేలు జరుగనున్నది.
ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షల చొప్పున..
ఊరులో సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మం దికి లబ్ధి చేకూరనున్నది. రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలుండగా మొత్తం 24 వేల మందికి ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అం దించనున్నది. ఇవే కాకుండా జిల్లాలో ఇటీవల పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా మరో రెండు నెలల్లో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా పేదలు సీఎం కేసీఆర్ సారుకు, తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.
ఇచ్చిన మాట తప్పని కేసీఆర్..
పేదల సొంతింటి కలను నెరవేరుస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే ఓవైపు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తూనే.. మరో వైపు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయం.
– రవి, షాద్నగర్
చాలా సంతోషకరం
సీఎం కేసీఆర్ పేదలకోసం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయం అందిస్తామని ప్రకటించడం గొప్ప పరిణామం.
– శ్రీశైలంగౌడ్, మక్తగూడ, షాబాద్ (మం)
సీఎం కేసీఆర్కు పేదలు రుణపడి ఉంటారు
సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్నారు. పేదల సొంతింటి కలను తీర్చేందుకు సొంత స్థలం ఉంటే రూ. 3లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. సీ ఎం కేసీఆర్కు పేదలు రుణపడి ఉంటారు.
–బట్టు లలితారమేశ్, ఎంపీపీ మర్పల్లి
గత ఉమ్మడి ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
గృహలక్ష్మి పథకం ద్వారా మాలాంటి పేదల సొంతింటి కల నెరవేరు తుంది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు మాకు ఇంటిని మంజూ రు చేయలేదు. అప్పటి నుంచి అద్దె ఇంటిలోనే బతుకుతున్నా. ప్రభు త్వం సొంత స్థలం ఉంటే రూ. మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది.
–గాదె లక్ష్మి, రాంపూర్ కులకచర్ల మండలం
రూ. మూడు లక్షల సాయం హర్షణీయం
ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇంటిని నిర్మించుకోవాలనుకున్న పేదల కోసం రూ. మూడు లక్షల ఆర్థిక సాయం చేయాలని తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దీని ద్వారా ఇండ్లు లేని ఎంతో మంది పేదలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. తాను కూడా ప్రభుత్వ సాయంతో సొంత ఇంటిని నిర్మించుకుంటా.
–మంజుల, గ్రామం మాదారం, నవాబుపేట
నిరుపేదలకు వరం లాంటిది
గృహలక్ష్మి పథకం ఇల్లు లేని పేదలకు వరం లాంటిది. సొంత స్థలం ఉన్న వారికి ప్రభుత్వం రూ.మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకునే ఆస్కారం ఏర్పడింది. నిరుపేదల గుండెల్లో సీఎం కేసీఆర్ దేవుడిలా మారారు.
–బుల్ల నర్సింహులు, జనగాం గ్రామం, పెద్దేముల్
రేకుల ఇంటిలోనే బతుకుతున్నాం..
నాది చీలాపూర్ గ్రామం. కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నా. నాకు నలుగురు కొడుకులు.. కాగా వారు హమాలీలుగా పని చేస్తున్నారు. ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో ఏడు గజాల రేకుల షెడ్డులోనే మేమంతా బతుకుతున్నాం. ఎండాకాలంలో ఎండలకు.. వానకాలంలో వర్షాలకు ఇంట్లో ఉండలేక చాలా ఇబ్బందిపడుతున్నాం. సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకం కింద మాకు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తే ఇంటిని నిర్మించుకుంటా.
– ఇస్మాయిల్, చీలాపూర్, పూడూరు
ఇల్లు కట్టుకుంటం..
సర్కారు ఇచ్చే రూ.మూడు లక్షల సాయంతో ఇల్లు కట్టుకుంటం. ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. వానకాలం వచ్చిందంటే అవస్థలే. పేదల కష్టాలను అర్థం చేసుకున్న తెలంగాణ సర్కార్ ఇప్పటికే ‘డబుల్’ ఇండ్లు నిర్మిస్తున్నది. జాగ ఉన్నోళ్లకు పైసలిస్తమని చెప్పడం సంతోషంగా ఉన్నది. సొంత ఇల్లు లేక గుడిసెలోనే కొన్నేండ్లుగా ఉంటున్నాం. పేదలకు ఇండ్లు ఇస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
–కావలి నర్సమ్మ, గృహిణి, చౌదర్పల్లి, బొంరాస్పేట