వికారాబాద్, జూలై 26 : గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాలను రెండు రోజుల్లో గుర్తించి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుంచి పంచాయతీ భవనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, హరితహారం, మన ఊరు-మన బడి, ఆయిల్ పామ్, ఉద్యానవన పంటలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు సేకరించిన పంచాయతీ భవనాల నిర్మాణం కోసం స్థల సేకరణ పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, లేకుంటే మంజూరైన జీపీలను రద్దు చేసి వేరే పంచాయతీకి కేటాయించడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిందని, ఇప్పటి వరకు కొన్ని గ్రామ పంచాయతీల్లో స్థల సేకరణ జరుగలేదన్నారు. వెంటనే స్థల సేకరణతో పాటు పనులను వేగవంతం చేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 9వ విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున అధికారులందరూ అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి సారించాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, మినీ పల్లె ప్రకృతి వనాల్లో విస్తారంగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ తోటల పెంపకంపై దృష్టి
జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకంలో భాగంగా మూడు వేల ఎకరాల లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకు 691 ఎకరాలను గుర్తించడం జరిగిందన్నారు. గుర్తించిన రైతుల నుంచి మొక్కకు రూ.20ల చొప్పున డీడీలను సేకరించాలని సూచించారు. 1,571 ఎకరాల్లో ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన పంటల సాగుకు లక్ష్యం నిర్దేశించగా 1,122 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను ఎంపీడీవోలు, ఏఈలు వేగంగా పూర్తి చేయాలన్నారు. అన్ని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో అవసరం మేరకు మరుగుదొడ్లు, తాగునీటితో పాటు ఇతర మరమ్మతు పనులను చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు జిల్లాలో వారం రోజుల నుంచి నిరంతరంగా కురుస్తున్న వర్షాల పట్ల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, దోమలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో తరుణ్కుమార్, డిప్యూటీ సీఈవో సుభాషిణి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.