ఇబ్రహీంపట్నం, జూలై 2 : ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న అభివృద్ధిపై చర్చించే దమ్ములేక ప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశం శేరిగూడ సీకే కన్వెన్షన్హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం పని చేసే వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను గుర్తించి ఒకవైపు కేంద్రం అవార్డులు, రివార్డులు ప్రకటిస్తుంటే కండ్లుండి చూడలేని వారు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ ఒక్క రాష్ట్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృపేశ్, పార్టీ మండల అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, కొత్త కిషన్గౌడ్, రమేశ్గౌడ్, చీరాల రమేశ్, మున్సిపల్ అధ్యక్షులు వెంకట్రెడ్డి, జంగయ్య, కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యాచారం : మండల కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీ పాలకవర్గం ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని కలిశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా కాలనీలో ప్రధానంగా నెలకొన్న భూగర్భ డ్రైనేజీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సాయినగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. వెంటనే డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆయన కోరారు. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిరు. కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసాచారి, నాయకులు మహేశ్, చాంద్పాషా, రషీద్ తదితరులున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
ఆదిబట్ల : మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామానికి చెందిన కాకి నర్సింహకు రూ. 30 వేల చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వనం శ్రీను, కోల నాగేశ్, దాసు, మహేందర్, బీఆర్ఎస్ నాయకుడు నారాయణ పాల్గొన్నారు.