‘పల్లె ప్రగతి’తో పెండ్లిమడుగు అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. ప్రతి నెలా వస్తున్న రూ.60,993 ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం అందుబాటులోకి వచ్చాయి. పల్లెలో ఏ వీధి చూసినా సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు వేయడంతో పల్లెంతా పరిశుభ్రంగా కనిపిస్తున్నది. నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి, డంపింగ్యార్డుకు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో 13 రకాల మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అంతేకాకుండా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తూ చెట్ల కింద సేదతీరుతున్నారు. వంద శాతం మరుగుదొడ్లను నిర్మించడంతో పెండ్లిమడుగు స్వచ్ఛ గ్రామంగా మారింది. అంతేకాకుండా గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి గ్రామస్తులందరికీ ఇన్సూరెన్స్ చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలు మారడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– వికారాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)
స్వచ్ఛ గ్రామంగా పెండ్లిమడుగు
వికారాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో వికారాబాద్ మండలంలోని పెండ్లిమడుగు గ్రామపంచాయతీ రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు సమస్యలు తిష్ట వేసిన సంబంధిత గ్రామం పల్లెప్రగతితో స్వచ్ఛ పెండ్లిమడుగుగా రూపుదిద్దుకున్నది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పెండ్లిమడుగు గ్రామపంచాయతీ అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది.
బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా పెండ్లిమడుగు
సర్పంచ్, అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో భూగర్భజలాలను పెంపొందించుకునేలా వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటింటికీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నారు. వంద శాతం మరుగుదొడ్లను నిర్మించి బహిరంగ మలవిసర్జనరహిత గ్రామంగా తయారైంది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా కూలిపోయిన ఇండ్లను కూల్చడం, భవన శిథిలాలను తొలగించడం, నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేయడం, గ్రామాల్లో సర్కార్ తుమ్మ, జిల్లెడు వంటి పిచ్చిమొక్కలు, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పెంట కుప్పలను తొలగించడం, రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయడం వంటి పనులను చేపట్టారు. ప్రతినెలా సంబంధిత గ్రామానికి ప్రభుత్వం నుంచి రూ.60,993 నిధులు మంజూరవుతున్నాయి.
ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్ బుచ్చిరెడ్డి
ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోపాటు గ్రామాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు సర్పంచ్ బుచ్చిరెడ్డి కూడా తన సొంత డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తుండడం గమనార్హం. మరోవైపు ఇటీవల గ్రామానికి చెందిన రంగారెడ్డి విద్యుత్ షాక్తో మరణించాడు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఆ కుటుంబానికి సాయం చేయలేకపోయామని బాధపడిన సర్పంచ్ బుచ్చిరెడ్డి.. గ్రామ ప్రజలందరికీ సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ చేయిస్తూ జిల్లాలోని ఇతర గ్రామాల సర్పంచ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పల్లెప్రగతిలో చేపట్టిన పనులు
పల్లె ప్రగతి కార్యక్రమంతో గతంలో ఎన్నడూలేని విధంగా పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన పల్లెలుగా రూపుదిద్దుకున్నాయి. పెండ్లిమడుగు గ్రామ పంచాయతీలో పల్లెప్రగతిలో భాగంగా పల్లెప్రకృతివనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, తడి-పొడి చెత్త సేకరణ, చెత్త సేకరణకు ప్రత్యేకంగా ట్రాక్టర్, ట్రాలీ కొనుగోలు, నర్సరీ ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఇంకుడు గుంతల నిర్మాణం, ఎల్ఈడీ లైట్లు తదితర పనులను చేపట్టారు.
సంబంధిత గ్రామ పంచాయతీలో సుమారు రూ.8 లక్షలతో ఊర్లో ఎవరు మరణించినా చివరి మజిలీ గౌరవంగా చేయాలనే ఉద్దేశంతో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. వైకుంఠధామం చుట్టూ ప్రహరీతోపాటు దహన సంస్కారాలు పూర్తైన అనంతరం అక్కడే స్నానాలు చేసేందుకు మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా గదులను కూడా నిర్మించారు. ఉపాధి హామీ, ప్రజాప్రతినిధులు ఇచ్చిన నిధులతో పెండ్లిమడుగు గ్రామమంతా సీసీ రోడ్లను నిర్మించారు. ఏ ఒక్క కాలనీలో కూడా మట్టి రోడ్లు కనిపించే పరిస్థితి లేదు. పరిశుభ్రమైన సీసీ రోడ్లతో ఊరంతా అద్దంలా తయారైంది. సర్పంచ్ చేస్తున్న అభివృద్ధికి గ్రామస్తులు కూడా సహకరిస్తూ చెత్తాచెదారాన్ని ఏ ఒక్కరూ కూడా బయట వేయకుండా తడి-పొడి చెత్తను వేర్వేరుగా ఇస్తూ గ్రామాభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములవుతున్నారు.
పల్లెప్రకృతి వనంలో 13 రకాల మొక్కలు
పెండ్లిమడుగు గ్రామ పరిధిలో సరిపోను స్థలం లేకపోవడంతో నారాయణపూర్ గ్రామ శివారులోని ఎకరా స్థలంలో రూ.1.50 లక్షల ఉపాధి హామీ నిధులతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. పల్లెప్రకృతి వనంలో గ్రామస్తులు వాకింగ్ చేసేందుకు ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. పల్లెప్రకృతి వనంలో 1700 మొక్కలతో 13 రకాల మొక్కలను నాటారు. పల్లె ప్రకృతి వనంలో కానుగ, గుల్మెహర్, టెకోమా, జామ, బకునియా, గన్నేరు, నీలగిరి, సర్వి, శిశు, టేకు, రెయిన్ట్రీ, గులాబీ, అల్లనేరేడు మొక్కలను నాటారు. ప్రత్యేక హరితహారంలో భాగంగా ప్రతీ గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలనే ఆదేశాలతో పెండ్లిమడుగు గ్రామంలో ప్రత్యేకంగా హరితహారం నర్సరీని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది ఏయే మొక్కలు నాటాలో ముందుగానే నిర్ణయించి సంబంధిత మొక్కలను నర్సరీలో పెంచుతూ వస్తున్నారు.
ఏ గ్రామంలోనూ లేనివిధంగా సంబంధిత గ్రామంలో నర్సరీల్లోని మొక్కల సంరక్షణకు సర్పంచ్ సొంత డబ్బులతో ప్రత్యేక షెడ్ను ఏర్పాటు చేశారు. పెండ్లిమడుగు గ్రామంలోని ప్రధాన రహదారితోపాటు గ్రామంలోని కాలనీల రోడ్లకు ఇరువైపులా పల్లెప్రగతిలో భాగంగా 1600 మొక్కలను నాటారు. గ్రామంలో ఎక్కడా చూసినా సీసీ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలతో పచ్చదనం సంతరించుకున్నది.
తడి-పొడి చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారీ
ప్రతిరోజూ ఇంటింటికి వెళ్లి పంచాయతీ కార్మికులు తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఇందుకుగాను డబ్బాలను కూడా అందజేశారు. పంచాయతీ డబ్బులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డులో తడి-పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు. గత రెండేండ్లుగా కంపోస్ట్ ఎరువును గ్రామంలోని మొక్కలకు వినియోగిస్తూ వస్తున్నారు. గ్రామమంతా పరిశుభ్రంగా ఉండేలా ప్రతిరోజూ గ్రామంలోని రోడ్లన్నింటినీ శుభ్రం చేస్తూ వస్తున్నారు. గ్రామంలో నిర్మించిన అండర్ డ్రైనేజీ వ్యవస్థతో ఎక్కడా కూడా మురుగునీరు కనపడే పరిస్థితి లేదు.
ప్రభుత్వం, ప్రజల సహకారంతోనే గ్రామాభివృద్ధి
పల్లెప్రగతి కార్యక్రమంతో మా గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గతంలో ఎన్నడూలేని విధంగా గ్రామాభివృద్ధికి భారీగా నిధులొచ్చాయి. సీసీ రోడ్ల నిర్మాణం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తడి-పొడి చెత్త సేకరణ తదితరాలతో ఊరంతా పరిశుభ్రంగా కనిపిస్తున్నది. తడి-పొడి చెత్తను వేరు చేస్తూ గ్రామ ప్రజలు కూడా గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు.
– బుచ్చిరెడ్డి, సర్పంచ్, పెండ్లిమడుగు