వికారాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. రెండేండ్లుగా లక్షల్లో పని దినాలను తగ్గిస్తూ పేదల కడుపు కొడుతూ ఉపాధి హామీ పథకంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్నాయి. కేవలం రెండేండ్లలోనే జిల్లాలో ఉపాధి హామీ పని దినాల సంఖ్యను దాదాపు 50 లక్షలకు తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా బంద్ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ కూలీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఏటా వేసవిలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు అదనపు కూలీ డబ్బులను కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తున్నది. వేసవిలో భానుడి ప్రతాపంతో అధిక సమయం పని చేయలేదు. దీంతోపాటు మండే ఎండలోనూ ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న దృష్ట్యా అదనంగా కూలీ డబ్బులను గత పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది.
ముఖ్యంగా ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు మాసాల్లో అధిక మొత్తంలో అదనపు కూలీ ఇస్తూ వచ్చారు. ఫిబ్రవరి నెల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉపాధి హామీ కూలీలకు అందజేసే వేతనాన్ని ఫిబ్రవరి మాసంలో 20 శాతం అదనంగా, మార్చి మాసంలో 25 శాతం అదనంగా, ఏప్రిల్, మే మాసాల్లో 30 శాతం అదనంగా చెల్లిస్తూ వస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలో ఇప్పటి వరకు ఉపాధి హామీలకు వేసవిలో చెల్లించే అదనపు కూలీ డబ్బులకు సంబంధించి ఆలోచించకపోవడం గమనార్హం. ఏటా ఫిబ్రవరి రెండో వారంలోగా అదనపు కూలీ ప్రకటన వస్తున్నప్పటికీ ఈ ఏడాది ఇప్పటికీ అదనపు కూలీ డబ్బుల ప్రకటన రాకపోవడంతో ఉపాధి హామీ కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం కూలీలకు అదనపు వేతనం రానట్టేనని అధికారుల ద్వారా తెలిసింది.
ఈ ఆర్థిక సంవత్సరం 59.31 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 52.36 లక్షల పని దినాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.272 కూలీ డబ్బులను అందజేస్తున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకుగాను ఇప్పటి వరకు రూ.97.65 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు. మరోవైపు జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారంతోపాటు ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి ఊట గుంతల నిర్మాణం, మట్టి రోడ్ల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. అసైన్డ్ భూముల్లోని రాళ్లను తీసివేయడం, భూమిని చదునుచేయడం, బౌండ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు అసైన్డ్ భూముల్లో చేపట్టనున్నారు.
ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, నీటి ఊట గుంతలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ కాలువలో పూడికతీత తదితర పనులను చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,83,309 జాబ్కార్డులు ఉండగా 3,77,087 మంది కూలీలు ఉన్నారు.
ఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించడం పోయి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 శాతం మేర కుటుంబాలకు కూడా పనిని కల్పించలేకపోయారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 30 రోజులే గడువున్నా ఇప్పటి వరకు కేవలం 3127 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించారు. రెండేండ్ల క్రితం వరకు జిల్లాలో ఏటా 20 వేలకుపైగా కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, గత రెండేండ్లుగా వంద రోజుల పని పొందే కూలీల సంఖ్య మూడు వేలకూ పెరగకపోవడం గమనార్హం.
జిల్లాలోని కొడంగల్, నవాబుపేట, పూడూరు, వికారాబాద్, దోమ, మర్పల్లి, పెద్దేముల్, మోమిన్పేట, బంట్వారం బొంరాస్పేట మండలాల్లో మాత్రమే 100 కుటుంబాలకుపైగా వంద రోజులపాటు పనిని కల్పించగా, మిగతా 8 మండలాల్లో సింగిల్, డబుల్ డిజిట్లోనే పని కల్పించారు. కోట్పల్లి మండలంలో అత్యల్పంగా కేవలం 30 కుటుంబాలకు మాత్రమే వంద రోజులపాటు పనిని కల్పించడం గమనార్హం. కులకచర్ల మండలంలో 58 కుటుంబాలు, యాలాల మండలంలో 64, తాండూరు మండలంలో 37, బషీరాబాద్ మండలంలో 81, దౌల్తాబాద్ మండలంలో 50, పరిగి మండలంలో 49, ధారూరు మండలంలో 96 కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు.