కొడంగల్, నవంబర్ 1 : కాంగ్రెస్తో రాష్ర్టం బాగుపడదు.. రేవంత్తో ఒరిగేదేమీ లేదని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖామాత్యులు పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెతో కష్టాలు తప్పవనేది నిజమని, పక్క రాష్ట్రం కన్నడ ప్రజల ఇబ్బందులను చూస్తే అర్థం అవుతుందని పేర్కొన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదని, కరెంటు కోతలతో చీకటిని అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. అటువంటి కష్టాలను తెలంగాణ ప్రజలు కొనితెచ్చుకోవద్దని, ఎన్నికల్లోనే అప్రమత్తంగా ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించుకోవచ్చని సూచించారు. కాంగ్రెస్ ఇస్తున్న 6 గ్యారెంటీలు గతంలోని 60 సంవత్సరాల పాలనలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలును చూసి కాంగ్రెస్ కళ్లు తెరిచిందన్నారు. బీఆర్ఎస్ పథకాలను కాపీ కొడుతూ అంతకంటే రెట్టింపు అన్నట్లుగా నోటికి వచ్చిన వాగ్దానాలు చేసి ప్రజలకు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి ఆరోపించారు.
గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఎటువంటి మేలు చేశాడో ప్రజలు రేవంత్ను ప్రశ్నించాలని మంత్రి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాను చేశానని గొప్పలు చెప్పుకొంటున్నారని, ఆయన నియోజకవర్గానికి చేసింది ఏ ఒక్కటి కూడా లేదన్నారు. 2018 ఎన్నికలకు ముందు నియోజకవర్గం అన్నింటా వెనుకబడినట్లుగా ఉండేదని, పట్నం నరేందర్రెడ్డి గెలిచిన 5 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి కొడంగల్ రూపురేఖలను మార్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్లో అధికారం కోసం కొట్టుకునే నాయకులు మాత్రమే ఉన్నారని, బీఆర్ఎస్లో ప్రజా సంక్షేమానికి, ప్రజా అభివృద్ధికి బాసటగా నిలిచే నాయకులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రతిపక్షాల మోసపూరితమైన మాటలు విని సంక్షేమాన్ని దూరం చేసుకోవద్దని, ఆ తరువాత కన్నడ ప్రజల మాదిరిగా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని, ఎవరి ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందనేది గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధికి అండగా నిలువండి, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో పట్నం నరేందర్రెడ్డిని మరోమారు ఎమ్మెల్యేగా, సీఎం కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి సీఎంను చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.